సత్యజిత్ రాయ్ పై నండూరి

(నండూరి రామమోహనరావు సంపాదకీయాల సంకలనం “వ్యాఖ్యావళి” లోని వ్యాసం ఇది. సత్యజిత్ రాయ్ మరణించినపుడు వచ్చింది. ఇవ్వాళ రాయ్ శతజయంతి సందర్భంగా టైపు చేసి పెడుతున్నాను. కాపీరైట్ సమస్యలు ఉంటే ఇక్కడో వ్యాఖ్య పెట్టండి, వ్యాసాన్ని తొలగిస్తాను. గతంలో ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రస్తావించాను. అప్పటికి ఈ పుస్తకం ఆర్కైవ్ లో ఉన్నదని తెలీదు. )

పథేర్ పాంచాలి 1955నాటి చిత్రం. అది కలకత్తాలో విడుదల అయినప్పుడు డిల్లీ, బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో ఆదివారాల మార్నింగ్ షోగానో, ప్రత్యేకాహూతులైన కొద్దిమంది చలనచిత్ర కళాభిమానులకో ప్రదర్శించబడినప్పుడు దేశవ్యాప్తంగా అది కలిగించిన అపూర్వ సంచలనం ఈరోజు ఎందరికి జ్ఞాపకం వున్నదో మాకు తెలియదు. బహుశా ఈ తరం వారు అది ఊహించనైనా ఊహించలేరు. 

సత్యజిత్ రాయ్ తీసిన మొట్టమొదటి చిత్రం పథేర్ పాంచాలి ఎలా విడుదల అయింది? మండువేసవి మధ్యాహ్నవేల మల్లెల పరిమళాన్ని మోసుకు వచ్చిన మలయానిలవీచికలా, వెచ్చని నుదుటిపై చల్లని కరస్పర్శలా, మనస్సులోని మాలిన్యమంతా క్షాళనం చేసే మానవతా గంగాజలంలా, నడివయస్సు నుంచి బాల్య స్మృతులలోనికి రివ్వున తీసుకుపోయే “టైం మెషీన్” లా విడుదల అయింది.

భారతదేశంలో అటువంటి చిత్రం తీయడం సాధ్యమా? పాటలు, నృత్యాలు, సెట్టింగులు, అందాల హీరో, హీరోయిన్లు లేని భారతీయ చిత్రాన్ని ఊహించడం కూడా కష్టమైన ఆ రోజులలో పథేర్ పాంచాలి ఒక కఠోర వాస్తవికతతో, వ్యథార్త జీవిత యదార్థ దృశ్యాన్ని ఆవిష్కరించింది. అందులో పాటలు లేవు – రవిశంకర్ మనోజ్ఞ నేపథ్య సంగీతం తప్ప. నృత్యాలు లేవు – పది పన్నెండేళ్ళ దుర్గ వర్షాగమనంతో పురివిప్పిన నెమలిలా పరవశించి జడివానలో తడుస్తూ గిరగరా తిరగడం తప్ప. అందాల హీరో, హీరోయింలు లేరు – ఒక నిరుపేద పురోహితుడు, అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తొంభై ఏళ్ళ ఒక ముదివగ్గు తప్ప. 

కానీ ఆ చిత్రంలో భారతదేశపు అమాయిక గ్రామీణ వాతావరణం ఉంది. దుర్భర దారిద్ర్యం ఉంది. కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ళు, విధి వెక్కిరింతలు, ఒక శిశువు జననం, ఒక వృద్ధురాలి నిశబ్ద మరణం, మొగ్గగానే రాలిపోయిన ఒక బాలిక అర్థం లేని మృతి వున్నాయి. అదే సమయంలో చల్లగాలికి తలలెగరేసే రెల్లుపూల మొక్కలు, దూరంగా గుప్ గుప్ మంటూ నాగరిక ప్రపంచానికి ప్రతీక లాంటి రైలు, గుయ్య్ మని శబ్దం చేస్తూ సందేశ సంకేతాలను మోసుకుపోయే టెలిగ్రాఫ్ స్తంభాలు, గతుకుల కాలిబాట, వర్షారంభవేళ కొలను అలలపై తూనీగల నాట్యం; చిన్నపిల్లల గుజ్జన గూళ్ళాటలు, వీథి భాగవతం, తుఫానుకు పడిపోయిన శిథిల గృహం, చనిపోయి వెల్లకిల పడిన కప్ప, ఖాళీచేసిన పాడింటిలోకి విధి వికృతపు నవ్వులా జరజరపాకిపోయే తాచుపాము, ఎన్నో వున్నాయి. అన్నీ వున్నాయి కాని, సాంప్రదాయికార్థం లో “కథ” లేదు. జీవితం వున్నది. కఠోర జీవితం వున్నది. ఇంతకంటే మంచి రోజుల కోసం ఆ జీవితం చూసే ఎదురుచూపులున్నాయి.

పథేర్ పాంచాలి తర్వాత ఆయన సుమారు 30 కథా చిత్రాలు, ఇతర చిత్రాలు తీశారు. అయినా ‘సాంకేతికా నైపుణిలో తప్ప అన్ని విషయాల్లోనూ అదే మేటి. ఆయన ప్రతిచిత్రం దేనికదే సాటి. ఒక చిత్రం నుంచి మరొక చిత్రానికి సినిమా టెక్నిక్ లో, కథా కథనంలో ఆయన ఎదుగుతూ పోయారు. మేరు శిఖరం ఎత్తున ఎదిగారు. గ్రిఫిత్, ఐజెన్ స్టయిన్, చాప్లిన్, బెర్గ్మెన్, కురోసావా ల ఎత్తుకు ఎదిగారు. 

రాయ్ చిత్రాలలో ఒక చిత్రం: చిత్రాన్ని పోలిన చిత్రం వుండదు. నూతనత్వాన్వేషణ మార్గంలో రాయ్ నిత్య పథికుడు. అపూ ట్రైలజీ అనబడే పథేర్ పాంచాలీ, అపరాజిత, అపూర్ సంసార్ చిత్రాలు మూడింటిలోను చావులున్నాయి. సుఖానుభూతులన్నీ ఒక రకంగానే వుంటాయి గాని, దుఃఖానుభూతులు దేనికదేనని టాల్ స్టాయ్ చెప్పినట్లు ఒక మృతిలాంటిది మరొకటి వుండదు.

జల్సాఘర్ చిత్రంలో అవసానదశలో వున్న ఫ్యూడల్ సంస్కృతి తన ఉనికిని నిలబెట్టుకొనడానికి ఎలా పాకులాడుతుందో చూస్తాము. టాగోర్ కథ ఆధారంగా తీసిన చారులత ఒక అసంపూర్ణ మనోహర కావ్యం లాంటిది. మహానగర్, ప్రతిద్వంది, సీమబద్ధ, జనారణ్య చిత్రాలలో దేని ప్రత్యేకత దానిదైనా, ఆధునిక జీవన సమ్మర్దపు కాళ్ళ కింద పడి నలిగిపోయే మానవత్వపు విలువలను చూస్తాము. తీన్ కన్య మూడు చిత్రాలూ టాగోర్ కు శత జయంతి నివాళులు. ఆశని సంకేత్ 1942నాటి బెంగాల్ క్షామ రాక్షసి కోరలలో చిక్కి విలవిలలాడిపోయిన నైతిక మూల్యాలను నిర్దయగా చూపిస్తుంది. అరణ్యేర్ దిన్ రాత్రి కొన్ని అసాధారణ సన్నివేశాలలో మానవుల నిజస్వరూపాలెలా బయట పడిపోతాయో హాస్యభరితంగా చూపిస్తుంది.

ఇవీ, తన ఇతర చిత్రాలలో సత్యజిత్ రాయ్ మనలను పోలిన మానవులనే తీసుకుని, ఎవరు ఏ సన్నివేశంలో ఎందుకు ఎలా ప్రవర్తిసారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా ప్రతిస్పందిస్తారో ఒకసారి ఒక తత్వవేత్తలా, ఒకసారి మనస్తత్వ వేత్తలా, ఒకసారి సాంఘిక శాస్త్రవేత్తలా విశ్లేషిస్తూనే, అన్నిటిలోను మానవుల దౌర్బల్యాల పట్ల ఆర్షమైన, ఆర్ద్రమైన సానుభూతిని కనబరుస్తారు. ఆయన మొత్తం జీవిత కృషిని ఆంచనా వేస్తే పూర్వసూక్తిని కొంచెం మారి “నా నృషిః కురుతే చిత్రం” అనాలనిపిస్తుంది.

సత్యజిత్ రాయ్ ది బహుముఖ ప్రతిభ. రవిశంకర్, విలాయత్ ఖాన్ వంటి వారి సహాయం పొందిన తొలి చిత్రాలను మినహాయిస్తే తన అన్న చిత్రాలకు తానే సంగీత దర్శకుడు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం పట్ల ఆయన అభిరుచి, బెంగాలీ జానపద బాణీలలో అభినివేశం జగత్ప్రసిద్ధం. “గోపీ గాయ్ నే బాఘా బాయ్ నే” చిత్రంలో ఆయన కట్టిన బాణీలు శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. అదికాక రాయ్ తన చిత్రాలకు తానే ఆర్ట్ డైరెక్టర్ (టాగోర్, నందలాల్ బోస్ ల సాన్నిధ్యంలో చిత్రకారుడుగానే ఆయన జీవితం ప్రారంభమైంది). స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్టు రైటర్, కథా రచయిత, ఎడిటర్, పెక్కు సందర్భాలలో తానే ఛాయా గ్రాహకుడు. స్వయంగా రచయిత కూడా అయిన రాయ్ వ్రాసిన డిటెక్టివ్ కథలు, పిల్లల కథలు, సైంస్ ఫిక్షన్ భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఆయన చిత్రాలలో పెక్కింటికి స్వర్ణకమలం వంటి అవార్డులు లభించినప్పటికీ, అవసానదశలో భారతరత్న అవార్డు లభించినప్పటికీ, స్వదేశంలో కంటే విదేశాలలోనే రాయ్ ప్రతిభా విశేషాలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందన్న ప్రతీతిలో కొంత నిజం లేకపోలేదు. కాంస్, వెనిస్, బెర్లిన్ మొదలైన చోట్ల ఆయన చిత్రాలకు వచ్చిన అవార్డులు, ఫిలిప్పీన్స్ ఇచ్చిన మెగ్సేసే అవార్డు, బ్రిటిష్ ఫిలిం విమర్శకులు ఒక అర్థశతాబ్దపు (1925-1975) అత్యుత్తమ చిత్ర దర్శకుడుగా ఆయనకిచ్చిన గుర్తింపు, ఫ్రాన్సు అధ్యకుడు స్వయంగా అందించిన లీజియన్ ఆఫ్ ఆనర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి అరుదుగా విదేశీయులకిచ్చే ఆనరరీ డాక్టరేట్. అంతే అరుదుగా అమెరికన్ మోషన్ పిక్చర్ అకాడమీ విదేశీయులకిచ్చే స్పెషల్ ఆస్కార్, ఇవన్నీ ఇందుకు నిదర్శనాలు. నోబెల్ బహుమతి గ్రహీత సాల్ బెల్లో తన “హెర్జోగ్” నవలలో ఒకచోట సత్యజిత్ రాయ్ ప్రశంస తీసుకురావడం సృజనాత్మక సాహిత్యంలోకి కూడా ఆయన పేరు వెళ్ళిందనడానికి గుర్తు.

చివరగా ఒక మాట. ప్రపంచమంతా జేజేలు పలికింది గాని భారతీయ చలనచిత్ర ప్రముఖులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకొనకపోవడం దురదృష్టం. భారతీయ దారిద్ర్యాన్ని తన చిత్రాలలో ప్రదర్శించి పాశ్చాత్యుల ప్రశంసలు సంపాదించుకున్నవాడుగా ఆయనను కొందరు పరిగణించడం వారి మేధా దారిద్ర్యానికి చిహ్నం. తాను కళాఖండాలు తీస్తున్నానని ఆయన ఎన్నడూ  అనుకోలేదు. అందరూ చూచి ఆనందించే చిత్రాలు తీయడమే తన ధ్యాయమని, వ్యాపార విజయ దృక్పథం వున్నంత మాత్రాన కళామూల్యాలు లోపించనక్కరలేదని ఆయన విశ్వాసం. ఆమాటకు వస్తే తనకు స్పూర్తి ఇచ్చినవారిలో అమెరికన్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాబర్ట్ ఫ్లాహర్టీ, సోవియెట్ దర్శకుడు అలెగ్జాండర్ డోవ్జెంకో లతో పాటు ఎందరో హాలీవుడ్ దర్శకులు కూడా ఉన్నారనే వాడు రాయ్. సత్యజిత్ రాయ్ భారతీయ సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహామహుడు. నేడు ఆయన లేడు. ఆయన చిత్రాలున్నాయి. ఆయన ప్రతిభ ఉంది. 

(ఏప్రిల్ 25, 1992)

Published in: on May 2, 2021 at 5:22 am  Comments (1)  

గణాంకాన్వేషణ

అది Statistical Exploration అన్న దానికి నేను పెట్టుకున్న తెలుగు పేరు లెండి.

కొన్ని రోజుల క్రితం నాకు, నాకు తెలిసిన పెద్దాయన ఒకరికి మధ్య ఒక సంభాషణ జరిగింది. సారాంశం ఏమిటంటే – “పుస్తకం.నెట్ లో నాకు విశ్వనాథ రచనలు తప్ప ఏం కనబడ్డం లేదు. వెబ్సైటు చూడ్డం మానేద్దామనుకుంటున్నాను. అంత అభిమానం ఉంటే ఒక విశ్వనాథ వెబ్సైటు పెట్టుకొండి, మాబోంట్లను వదిలేయండి” అని.

అప్పుడు నేను – “పుస్తకం.నెట్ పాఠకుల వ్యాసాలతో నడిచే వెబ్సైటు. నేను గానీ ఇతర నిర్వహకులు కానీ మొత్తం కంటెంట్ సృష్టించము. వైవిధ్యం కావాలంటే అందరూ భిన్న రకాల పుస్తకాల గురించి రాస్తే తప్ప రాదు” అని చెప్పాను. ఆ తరువాత ఇంకాసేపు ఈ విషయం మీద చర్చించుకున్నాక ఆ సంభాషణ ముగిసింది. కానీ, ఆ వ్యాఖ్య నా మది తొలుస్తూనే ఉంది. కొంచెం సమయం చిక్కడంతో ఇవ్వాళ: గత కొన్ని నెలలుగా వారానికి మూణ్ణాలుగు వ్యాసాలు కనీసం ఉంటున్నాయి, ఇందులో విశ్వనాథ రచనల పైన వచ్చినవి ఎన్ని? అన్న సందేహం కలిగి గణాంకాలను చూశాను కాసేపు. నేను కనుక్కున సంగతులు ఇవి: (మరీ కాకిలెక్కలు కావు కానీ, అలాగని విశేష గణాంక పటిమ కూడా చూపలేదు)

ఇప్పటిదాకా 1485 పోస్టులు (2009 జనవరి ఒకటో తేదీ నుండి) వస్తే, అందులో 148 పోస్టులు 2014 జనవరి 1 నుండి వచ్చినవి. ఇది 27వ వారం ఈ ఏడాది లో. అంటే, దాదాపుగా వారానికి 5.5 టపాలు అనమాట. అందులో ప్రతి వారమూ ఒకటి వీక్షణం. నాకు గుర్తున్నంతవరకూ పూర్ణిమ ప్రతి వారమూ ఒక పుస్తకం గురించి పరిచయం రాసింది. ఇవి ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లో రాయబడ్డ పుస్తకాలు, అనువాదాలు. శ్రీశ్రీ అనంతం పై రాసినది ఒక్కటే తెలుగు పుస్తకం గురించి. భారత ఉపఖండపు, విదేశీ రచయితలు ఉన్నారు ఈ వ్యాసాల్లో ప్రస్తావించబడ్డ వారిలో. నేను గమనించినంతలో ఈ పరిచయాల్లో ప్రస్తావించబడ్డ రచయితలు రాసిన భాషలు: ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పోర్చుగీసు, హిబ్రూ, రష్యన్, స్వీడిష్, టర్కిష్, నార్వేజియన్, ఫ్రెంచి, చెక్ భాషలు (వివరాలకు పూర్ణిమ వ్యాసాలన్నీ ఈ లంకెలో చూడవచ్చు).

సరే, 148 లో ఒక 27 పూర్ణిమవి, ఒక 27 వీక్షణం వీ అయ్యాయా… విశ్వనాథ వారి గురించి వచ్చిన టపాలు 20. అందులో, శ్రీవల్లీ రాధిక గారు పురాణ వైర గ్రంథమాల గురించి వరుసగా 12 వారాలు రాసిన పరిచయాలు కూడా ఉన్నాయి. ఇక తక్కిన ఎనిమిదిలో ఆరు హేలీ రాసినవి, ఒకటి ఆంగ్లంలో సి.ఎస్.రావు గారు రాసిన Sri Viswanatha as a Short Story Writer వ్యాసం, మరొకటి యద్దనపూడి కామేశ్వరి గారి 2011 వ్యాసానికి పునర్ముద్రణ. సరే, మొత్తానికి 27 వారాలకి 20 వ్యాసాలు – అంటే వారానికి ఒక వ్యాసం కన్నా తక్కువ. ఇంకా డెబ్భై పై చిలుకు వ్యాసాలు, ప్రకటనలు వగైరాలున్నాయి.

సరే, కాస్త ఏవన్నా వైవిధ్యం ఉందేమో చూద్దాము అని ఖజానా పేజీ తెరిచి నెలవారీగా చూడ్డం మొదలుపెట్టాను. నేను చూసినంతలో నెలకి కొన్ని టపాల లంకెలు కింద జతచేస్తున్నాను. ఇవి మట్టుకే వైవిధ్య భరితమైనవని కాదు. అన్నీ లిస్టు చేయలేను కనుక, నెలలో వచ్చిన వ్యాసాల్లో వైవిధ్యం చూపడానికి నేను పక్షపాతాలు అవీ లేవనుకుంటూ ఎంపిక చేసినవి ఇవి:

జనవరి 2014:
* తిరుమల: రవీందర రెడ్డి ఛాయాచిత్ర సంకలనం గురించి జంపాల చౌదరి గారి వ్యాసం
* అంధా యుగ్ -ధరం వీర్ భారతి రాసిన హిందీ నాటకం గురించి పూర్ణిమ వ్యాసం
* Devil on the cross – కెన్యాకు చెందిన Ngũgĩ wa Thiong’o అన్న రచయిత గికుయు భాషలో రాసిన పుస్తకానికి ఆంగ్లానువాదం గురించి హేలీ వ్యాసం
* 2013 లో చదివిన పుస్తకాల జాబితాను పంచుకుంటూ ఐదుగురు వ్యక్తులు (ఇందులో ఒక స్కూల్లో చదువుకునే అమ్మాయి కూడా ఉంది) రాసిన వ్యాసాలు.

ఫిబ్రవరి 2014
* కవి, రచయిత గుల్జార్ రచనల గురించి – పూర్ణిమ, తృష్ణ, నాగిని గార్ల వ్యాసాలు
* The 11 pictures of time: The physics, philosophy and politics of time beliefs అన్న పుస్తకం గురించి హేలీ వ్యాసం
* జాక్ లండన్ ఆంగ్ల నవలలు “The call of the wild”, “White Fang” గురించి రానారె వ్యాసాలు

మార్చి 2014
* జీవీ కృష్ణారావు నవల కీలుబొమ్మలు గురించి ఆంగ్లంలో జీ.ఆర్.కె. మూర్తి వ్యాసం
* జగదీశ్ నాగవివేక్ పిచిక ఫొటో పోస్టులు
* అరిపిరాల సత్యప్రసాద్ కథల గురించి కొల్లూరి సోమశంకర్ వ్యాసం
* ఒక స్వీడిష్ సినిమా వెండితెర నవల పుస్తకం గురించి నేను రాసిన వ్యాసం (వైవిధ్యం ఉందని చూపడానికి ఇస్తున్న లంకె కానీ, సోత్కర్షకు కు కాదని గమనించగలరు)

ఏప్రిల్ 2014:
* రాణి శివశంకరశర్మ “గ్రహాంతర వాసి” పై హేలీ వ్యాసం (ఈ పుస్తకం మీద అంతర్జాలంలో అది ప్రచురించబడేనాటికైతే నాకే సమీక్షా కనబడలేదు)
* వోల్గా “రాజకియ కథలు” పై రాగమంజరి గారి వ్యాసం
* “కొల్లబోయిన పల్లె” కథాసంపుటి పై రవి గారి వ్యాసం
* Things fall apart అన్న ప్రముఖ నైజీరియన్ ఆంగ్ల నవల గురించి రానారె వ్యాసం

మే 2014:
* హెన్రిక్ ఇబ్సెన్ నార్వేజియన్ నాటకాల ఆంగ్లానువాదాల గురించి రెండు వ్యాసాలు
* ఇస్మత్ చుగ్తాయ్ రచన గురించి వ్యాసం
* డక్కలి జాంబ పురాణం గురించి వ్యాసం
* ఆంగ్ల, ఆంగ్లానువాదంలో వచ్చిన కొన్ని నవలల పరిచయాలు
(నవల, నాటకం, వ్యాసం, ఆత్మకథ – ఇక్కడే నాలుగు తరహాల పుస్తకాల ఉదాహరణలు ఉన్నాయి!)

జూన్ 2014:
సంఖ్యా పరంగా వ్యాసాలు తక్కిన నెలలతో పోలిస్తే తక్కువే అయినా, ఒక తెలుగు నవల, ఒక చెక్ నవలకు ఆంగ్లానువాదం, ఒక memoir ఇలా వ్యాసాలు వచ్చాయి (అదే, మూడు విశ్వనాథ వ్యాసాలు కాకుండా!)

అదనమాట. మొత్తానికి ఒకే వ్యక్తి రచనలపైన ఆరు నెలల్లో ఇరవై వ్యాసాలు రావడం అద్భుతమైన విషయం గా తోస్తుంది నాకు. ఏదో ప్రతి రెండు వ్యాసాలకి ఒకటి విశ్వనాథ వ్యాసం ఉంటే – ఇది విశ్వనాథ మోనోపొలీ అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఏడెనిమిది వ్యాసాలకి ఒక విశ్వనాథ వ్యాసం కనుక అంత ఖంగారు పడక్కర్లేదేమో అనిపిస్తోంది. అందునా, 2009 నుండి చూస్తే మొత్తం దాదాపు నలభై విశ్వనాథ వ్యాసాలుంటే, 1400 పై చిలుకు ఇతర వ్యాసాలున్నాయి – వెబ్సైటులో పాత వ్యాసాలు కూడా ఉన్నాయి కద చదువుకోడానికి!! 😉

అలాగ, ఇతరుల సంగతేమో కాని, ఈ టపా రాసినందువల్ల నాకు పుస్తకం లో ఎన్ని మంచి వ్యాసాలొస్తున్నాయో, ఎంత వైవిధ్య భరితమైనవి ఉన్నాయో తల్చుకుని ఆనందించే అవకాశం కలిగింది.

అప్పుడప్పుడు –
1) పుస్తకంలో పూర్ణిమ, సౌమ్య తప్ప ఎవరూ రాయరు
2) పుస్తకంలో వ్యాఖ్యలు కూడా వాళ్ళే రాసుకుంటూ ఉంటారు
3) పుస్తకం విశ్వనాథ భజనమందిరం
4) (ఇంకాస్త ముందుకెళ్ళి) పుస్తకం వాళ్ళు మైనార్టీ కులాలను, మతాలను వేధిస్తారు
5) పుస్తకం వాళ్ళని ఎవళ్ళో ఏదో అన్నారని జైల్లో వేశారు
– ఇలాంటివి అంటూంటే, నేను గమనించని కొన్ని సంగతులు నాకు తెలుస్తూ ఉంటాయనమాట.

పుస్తకం చదువరులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు-ద్వేషులకు, అనుమానించేవారికి, అవమానించేవారికి -అందరికీ ధన్యవాదాలు.
సర్వేజనా సుఖినో భవంతు.

Published in: on July 5, 2014 at 12:01 pm  Comments (3)  

పురాణ వైర గ్రంథమాల గురించి..

2009 జనవరి ప్రాంతంలో అప్పటికింకా నేను IIIT లో ఉన్నాను కనుక మా గ్రంథాలయంలో “పురాణవైర గ్రంథమాల” సిరీస్ నవలలు చదివేందుకు అవకాశం చిక్కింది. మొదట “భగవంతుని మీద పగ”, “నాస్తిక ధూమము”, “ధూమరేఖ” – ఇలాంటి పేర్లకి ఆకర్షితురాలినై చదవడం మొదలుపెట్టినా, నాకు పోను పోను అవి చాలా గొప్ప ఊహాశక్తితో రాసినట్లు అనిపించ సాగాయి. “వేయిపడగలు” నచ్చకా, అలాగని “హాహాహూహూ”, “విష్ణుశర్మ..” వంటివి చదివి విశ్వనాథ రచనలు ఇంకా చదవాలన్న కోరిక చావకా కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఈ నవలలు చదివే కొద్దీ ఆసక్తి పెరుగుతూ పోయింది.

అందరూ వరుసగా చదవమని చెబుతారు కానీ, నేను మొదట “చంద్రగుప్తుని స్వప్నము” చదివి, ఆ తరువాత దాని ముందువన్నీ మొదట్నుంచి వరుసగా చదివాను – నాకు మొదట్లో “భగవంతుని మీద పగ” దొరక్క. ప్రతి నవలలోనూ ఒక కథ మొదలై అంతమౌతుంది. తర్వాతి నవలలో చరిత్రలోని మరో అంకం గురించిన కథ వస్తుంది. కనుక, వరుసగా చదవడం తప్పనిసరి అని నేను అనుకోను. విడివిడి నవలలుగా చదవాలనుకునేవారు అలా కూడా చదువుకోవచ్చు కావాలంటే. అయితే, భాషకూ, శైలికీ అలవాటు పడటానికి మాత్రం కొంత సమయం పడుతుంది – అని నా అభిప్రాయం. మొత్తానికలా ఆరున్నర నవలలు పూర్తి చేశాక నేను యూనివర్సిటీ నుండి బయటపడ్డం, ఈ నవలలు నాకు అందుబాటులో లేకపోవడం ఒకేసారి జరిగింది.

ఒకదాన్ని మించిన క్రియేటివిటీ ఇంకోదానిలో ఉండే ఈ నవలలను చదవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది నాకు. ఈమధ్యలోనే శ్రీవల్లీ రాధిక గారు పుస్తకం.నెట్లో వరుసగా ఈ నవలల గురించి పరిచయం చేయడం మొదలుపెట్టి ఇటీవలే పన్నెండో నవలకు కూడా పరిచయం రాసి వ్యాస పరంపర ముగించారు. ఆ వ్యాసాలన్నీ ఇక్కడ చూడవచ్చు. నవలల గురించిన తెవికీ పేజీలను “పురాణవైర గ్రంథమాల” పేజీకి వెళ్ళి అక్కడ నుండి చూడవచ్చు.

మొత్తానికి రాధిక గారి వ్యాసాలు మొదట్లో అంతగా నచ్చకపోయినా (మొత్తం కథంతా చెప్పేస్తున్నారని), పోను పోను ఈ సిరీస్ మీద తిరిగి నాలో కుతూహలాన్ని రేకెత్తించాయి. అందుకు ఆవిడకి బహిరంగంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈసారి దేశం వెళ్ళినపుడు కాస్త తీరిగ్గా మొదట్నుంచీ చదవాలి అనుకుంటున్నా. ఆసక్తిగలవారు ఆ వ్యాసాలు చదివి పురాణవైర గ్రంథమాల గురించి తెలుసుకోవచ్చు. ౨౦౦౯ లో ఎప్పుడో ఓసారి నేనూ నాకు అర్థమైనది బ్లాగు పోస్టుల్లో రాద్దామనుకుని రాయలేదు. ఇవ్వాళే ఆ డ్రాఫ్ట్ పోస్టులన్నీ కనబడ్డాయి (ఆరు టపాలు!). అవి చూడగానే, రాధిక గారి వ్యాసాలకి నా బ్లాగులో ప్రచారం కలిగించాలనిపించింది 🙂

ఫలశృతి: ఈ వ్యాసం చదివిన వారు రాధిక గారి వ్యాసాల వద్దకు వెళ్ళి వాటిని చదివినచో, ఒక గొప్ప రచయిత ఊహాశక్తి గురించిన అవగాహన కలిగి ఆయన రచనలను కొన్నైనా చదవాలన్న ఆసక్తిని పొందగలరు.

పీ.ఎస్.: నాకు ఆయన రచనల్లోని ఐడియాలజీ ఎవరన్నా పట్టి చూపిస్తే కాని అర్థం కాదు (పుస్తకం.నెట్ లో హేలీ వ్యాసాల తరహాలో పట్టి పట్టి చూపిస్తే తప్ప). కనుక నా “గొప్ప రచయిత” వ్యాఖ్య ఆయన ఊహాశక్తి, రచనా పటిమ గురించి మాత్రమే. వాదోపవాదాలు కావాలనుకునేవారు దానికే స్టిక్ అవండి.

Published in: on June 24, 2014 at 10:56 am  Comments (3)  
Tags:

అక్కిరాజు వారి “ఎదుగని బిడ్డ”

edaganibiddaఆ మధ్య అమెరికా దేశంలో కొన్ని రోజులు గడిపినప్పుడు మనసు పాత పత్రికల మీదకి మళ్ళింది (కె.కె.రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు: మొదటినుంచి 1930 వరకూ అన్న పుస్తకం చదివిన ప్రభావంలో!). అపుడు చదివిన/చదవాలని పేర్చుకున్న వాటిల్లో నన్ను అమితంగా ఆకర్షించినది “ఎదుగని బిడ్డ” అన్న అక్కిరాజు ఉమాకాంతం గారి కథ. రచనా కాలం – 1914. ఎందుకు నన్ను ఆకట్టుకుందీ అంటే, ప్రధానంగా కథా వస్తువు వల్ల – తెలుగుతల్లి తన బిడ్డ (తెలుగు భాష) కి వచ్చిన రోగం గురించి వాపోవడం ఈ కథలో ముఖ్యాంశం.

*****
“రాజులు విడువగా మంత్రులు, మంత్రులు విడువగా రాజులు బిడ్డను కాలు క్రిందబెట్టనిచ్చినారనుకున్నావా? ఏమి బిడ్డరా, ఏమి బిడ్డరా అని నెత్తినబెట్టుకొననివారు లేరు.” ఇలాగ, తన బిడ్డ పుట్టుకతోనే రాజభోగాలు అనుభవించినప్పటీకీ, “ఏండ్లు పైనబడ్డవి, ఆకారము మారినది. కాని, బిడ్డ ఎదిగినట్లగుపడదు.” …. “ఎవరి ముచ్చట వారు తీర్చుకున్నారే కానీ, బిడ్డ ఎదుగుచున్నదా లేదాయని విచారించినవారు లేరు” – ఇదీ తన బిడ్డ రోగం. ఎదుగక పోవడం! ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆ తల్లి ఆక్రోశం. “నీవేచెప్పు, ఏండ్లేమో పైనిబడె. ముదిరినదన్న ముదరదు. అన్ని ఎదిగితేనె మొగము తగ్గట్లుండి ఇంపూ, సొంపూ …. బిడ్డను చూసుకున్నప్పుడెల్ల నాకడుపు కుమ్మరావమువలె కుమిలిపోవుచున్నది నాయనా! ఏమనుకున్నావో!” అని మనతో వాపోతుంది ఆ తల్లి. ఏమనిచెబుతాము? మనకిమల్లే అప్పటి రాజులకి కూడా వాళ్ళ డెడ్లైన్ల నడుమ పైపైని చూడ్డం కంటే ఎక్కువ సమయం చిక్కలేదేమో! ఎవరొచ్చి ఎవర్ని విమర్శించగలరు!

సరే, ఆ రాజులు పోయారు. ఈ భోగాలు పోయాయి. తురక రాజులొచ్చారు. ఇంత భోగం లేదు. “ఇదేమి బిడ్డరా” అన్నాడట ఒకరాజు. కనుక, బిడ్డని ఇంటికి తెచ్చేసుకుందట ఆ తల్లి, రాజాశ్రయాలు మానిపించేసి. “బిడ్డ వేలుడు కూడ పెరగలేదు. మొహము పెద్దయినది, బట్టతల పడ్డది. కాళ్ళు చెడిపోయినవి. చేతులు మొద్దులైనవి. బిడ్డను చూసిన కొలది గుండె నీరైపోవునే కాని ధైర్యము కలుగదు” – ఆ తల్లిబాధ వింటూంటే, మరి మనకూ ధైర్యము సన్నగిల్లదూ? అంత జీవితం చూసిన ఆ తల్లే తన బిడ్డ గురించి అలాగంటే, బ్రతికినన్నాళ్ళూ ఆ ఎదుగని బిడ్డ తప్ప దాని భోగమేదో ఎరుగని నా బోటి వాళ్ళకి ఏమనిపించాలి! 😦

ఆ తరువాత తెల్లరాజులొచ్చారు. వాళ్ళు మంచిరాజులని అందరూ చెబితే, ఆ తల్లి తన బిడ్డ రోగానికి చికిత్స చేయిస్తారని ఆశించింది. మరేం జరిగింది? “పూర్వపు రాసి విని తలయూచినవారొకరు. దూరముగా జూసి బిడ్డపై యొక కాసు, రెండు కాసులు పడవేసినవారొకరు. పాపము దలచినవారొకరు. మొహము చిట్లించుకున్నవారొకరు. ఎత్తుకున్నవారు లేరు. చంకనుబెట్టుకున్న వారు లేరు. ఎందుకు నాయనా భ్రమ? బిడ్డకు వెనుకటి రోజులు తిరిగి రావు. … నిజమున కేమి? బిడ్డ ఏమంత శృంగారముగా ఉన్నదని నెత్తిన బెట్టుకుందురు నాయనా ఇతరులు, నా యేడుపే కాని!” – ఏమి చెప్పాలో తోచింది కాదు నాకు ఇలా వాపోతూంటే. బిడ్డని నేను చూసినప్పటి నుండి అట్లే ఉంది. మరో బిడ్డ ఎలా ఉంటదో నాకు తెలియదు మరి. ఏదో అందం? ఏది అనాకరం? నాకెలా తెలుస్తుందండీ? అందుకని మౌనంగా ఉండిపోయాను. పైగా, ఈ బిడ్డ తరువాత పుట్టిన బిడ్డలందరూ వాళ్ళ తల్లుల కడుపు చల్లగా, కళకళలాడుతున్నారట. పేరు, ప్రతిష్ట, సిరిసంపదలు – అన్నీ సంపాదిస్తున్నారట. వీరి మధ్య, ఆ తల్లి depression ని అర్థం చేసుకొనువారెవరు? care for the care-giver అన్న అంశం గురించిన ఎరుక ఉన్నవారెవరు? (అ తల్లి కి ఇతరత్రా బాధలు కూడా ఉన్నవి కదా అసలుకే ఇప్పుడు!)

“భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు లేకపోగా, అన్నమునకే అగచాట్లు పడుచున్నది. అనగూడదు గాని నాయనా! చచ్చినదానిలోను, బ్రతికినదానిలోను జమకాకున్నది” అని ఏడుస్తూనే, వైద్యులేమన్నారో చెప్పిందావిడ – “రాజుల ఇండ్లలో చిన్నతనమునే తినరానిదెల్ల తినుటవలన బిడ్డకు పొట్టపాడైనది. ఇక పెరుగదు గాని బ్రతుకును. అని కొందరోదార్చిరి.” అన్నారట. తెల్లవైద్యము నేర్చిన మనవారేమో – “ఈతల, ఈకాళ్ళు, ఈ చేతులు, ఈ పొట్ట తీసివేసి” కొత్తవి వేయాలని అన్నారట. ఒక పక్కన ఇవన్నీ చేస్తే, ఈ మాత్రమన్నా బిడ్డ మిగలడేమో అన్న బెంగ, ఒక పక్క ఏమో, బిడ్డ బాగుపడతాడేమో అన్న ఆశ! ఏమి చేయాలి? అని ఆ తల్లి బాధ.

*****
ఏమి చెప్పాలి? ఉన్నట్లుండి ఆక్సిడెంటులో కుటుంబపెద్ద పోతే, “మాకే ఎందుకిలా జరగాలి” అని ఆ కుటుంబ సభ్యులడిగితే సమాధానం చెప్పగలమా? లేకలేక పుట్టిన పిల్లకి చిన్నప్పటినుంచే ఏదో రోగం ఉన్నదనీ తెలిస్తే ఆ తల్లిదండ్రులు “ఎందుకిలా జరిగింది?” అని అడిగితే సమాధానం ఇవ్వగలమా? ఆ తల్లి హిందూ ధర్మానుయాయి అయిన పక్షంలో “కర్మ” అనుకొనాలి. కాని పక్షంలో ఏమి చేసుకోవాలో? కొంచెం ఫ్యాషనుగా, “లక్” అనుకొనాలి కాబోలు. లేకపోతే, – “lack of vision” అనుకోవాలి. మరి ఎందుకు అది లేదంటే మళ్ళీ ఏమనుకోవాలి? ఎందుకు ఉండాలంటేనో? ఒకదాని వెంబడి ఒక ప్రశ్న ఇలాగ వస్తూనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకీ వీటి నుండి ఒక్కో జవాబు ఎంచుకుంటూ, చక్రభ్రమణం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి కాబోలు, భూమి తనచుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నట్లు! భూమి ఎందుకు తిరగాలి అసలు? – మళ్ళీ ప్రశ్న!

(ఉమాకాంతం గారు భాష రాసే పద్ధతి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు. నాకు అలా టైపు చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందువల్ల, సమయాభావం వల్ల, మామూలుగా టైపు చేశాను ఆ కథలోని వాక్యాలని.)

కథను చదవాలి అనుకుంటే, ప్రెస్ అకాడెమీ ఆర్కైవులలో (త్రిలింగ మాసపత్రిక, మే 1914 సంచిక, 14-18 పేజీలు) వెదుక్కోవచ్చు, లేదంటే, ఫేస్బుక్ “కథ” గ్రూపులో ఇక్కడ చదువవచ్చు.

Published in: on July 21, 2013 at 9:58 am  Comments (5)  

శ్రీపాద వారికి అన్నగారి సలహా

శ్రీపాద వారికి వారి పెద్దన్న గారు ఇచ్చిన సలహా ఇది. అదివరలో చదివినప్పుడు ఆట్టే గమనించని కొన్ని ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నాకీ పుస్తకంలో. నా విషయంలో ఇలా జరగలేదు కానీ, ఈ విషయం ఆలోచించదగ్గది!

****
“..గుణదోషాల సంగతి అలా ఉంచు. ఆ పద్యాల బంధం వదులు వదులుగా వుంది గాని బిగువుగా లేదు. ఆదిలోనే అలాంటి తేలిక పుస్తకాలు చదివితే సాహిత్యంలో మంచి ప్రవేశమూ కలుగదు, సరి అయిన రుచీ ఏర్పడదు. కనక ముందు నన్నయ భారతం చదువు. తరవాత మొదటి మూడాశ్వాసాలూ మనుచరిత్ర చదువు. అలాగే పారిజాతాపహరణమున్నూ పూర్వార్థం చదువు. తరవాత శృంగార నైషధం తప్పకుండా చదువు. దాంతో, సరిగా అవి అర్థం అయినా కాకపోయినా, గంభీర రచనలమీద నీకు ఆదరభావం కలుగుతుంది, దృఢపడుతుంది. అప్పుడు అర్థం సాధించాలన్న దీక్ష దానంతట అదే పుడుతుంది. పద్యబంధంలో వుండే బిగువు బోధపడుతుంది. ఆ వరసనే తిక్కన్న భారతం చదవాలి. తెలుగులో నీకు మంచి అభిరుచీ, సాహిత్యమూ కలగాలంటే యిది సరియైన పాఠ్యక్రమం”

Published in: on July 14, 2013 at 9:12 pm  Comments (1)  
Tags:

వంశవృక్షం (తెలుగు) సినిమా నుండి ఒక సంభాషణ

సంక్రాంతి దాకా ఏవీ రాయకూడదనే అనుకున్నా కానీ, ఎస్.ఎల్.భైరప్ప గారి నవల వంశవృక్ష ఆంగ్లానువాదం, తరువాత వంశవృక్షం తెలుగు సినిమా వెండితెర నవల, తరువాత వంశవృక్ష కన్నడ సినిమాలో కొన్ని భాగాలూ – అన్నీ చూశాక ఒకే దృశ్యం అన్నింటిలోనూ గొప్పగా ఉన్నట్లు తోచింది. పదే పదే గుర్తొచ్చింది. అది సరస్వతి తన మామగారిని – “నా కొడుకు ను నాతో పంపేయండి” అని అడిగే దృశ్యం. (నవల, సినిమా (ముఖ్యంగా తెలుగు వర్షన్) రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి కానీ, ఈ ఒక్క దృశ్యం విషయంలో మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్లు తోచాయి నాకు.)

దానితో, తెలుగు వెండితెర నవల (సినిమాకి: నవలీకరణ – శ్రీరమణ; సంభాషణలు – ముళ్ళపూడి వెంకటరమణ) లోని ఈ భాగాన్ని టైపు చేస్తున్నా. ఇది కాపీరైట్ ఉల్లంఘన అయిన పక్షంలో తెలియజేయగలరు. ఇక, ఈ అంశంపై అనేక వాదోపవాదాలు – వ్యతిరేక దృక్కోణాలు ఉండడం సహజం. అయితే, ఆ వాదోపవాదాలలో మాత్రం నేను పాల్గొనను అని ముందే మనవి చేసుకుంటున్నాను.

***************


“మావగారూ! గోదావరికి మనమెంత పాత్ర తీసుకెళితే అంతే నీరు దక్కుతుందని మీరు నాకోసారి చెప్పారు”
ఆచార్యులవారు ఆమె జవాబుకి నివ్వెరపోయి చూశారు.

“కఠినంగా మాట్లాడాను. మన్నించండి.” మామగారి నివ్వెరపాటు గమనించిన సరస్వతి అంది.

“తప్పేమీ లేదమ్మా. నేను తీసుకువెళ్ళిన పాత్రలో ఈ ఫలం తప్పకుండా వుందని నాకు నమ్మకం ఉంది. చూడమ్మా – సృష్టికి క్షేత్రం, బీజం రెండూ అవసరమే. అయినా, జన్మించే మొక్క బీజాన్ని బట్టి ఉంటుంది. వరి నాటికే పుట్టే మొక్కను వరిమొక్కే అంటారు గానీ గోధుమ అనరు. క్షేత్రం పేరు చెప్పుకోరు. మా అబ్బాయి మాధవుడు మా యింటివాడు. వాడి బిడ్డ వాడి యింటికి చెందుతాడు. బిడ్డలెపుడు తల్లికిగాని, తండ్రికిగాని చెందరు. వారు కుటుంబం ఆస్తి. నువ్వు కుటుంబంలో భాగంగా ఉంటే ఆ బిడ్డపై నీకు సర్వాధికారాలు ఉంటాయి. నువ్వు కుటుంబాన్ని కాదని అలా వెళ్ళినపుడు – ఆ బిడ్డని వాడి ఆస్తిని ఇంకో ఇంటికి తీసుకెళ్ళే హక్కు నీకు లేదు. ”

ఆచార్యులవారు ఆస్తి అనగానే సరస్వతి ఒక్కసారి తలెత్తి “నాకా ఆస్తి వద్దని ముందే చెప్పాను” అన్నది తీవ్రంగా. ఆచార్యుల వారు గంభీర వదనంతో –
“నీకలా చెప్పే అధికారం లేదు. నీ బతుకు నువ్వు దిద్దుకున్నట్టే వాడి బతుకు వాడూ దిద్దుకుంటాడు. వాడికా జ్ఞానం వచ్చేవరకూ వాడు పుట్టినచోట వాడికి లభించే సంస్కారం, చదువు, సంప్రదాయంతో పాటు వాడికి గల ఆస్తిని కూడా కాపాడి వప్పజెప్పడం కన్నవాళ్ళ ధర్మం. రేపు వాడు పెద్దవాడయ్యాక నా ఆస్తిని ఎందుకు వదిలేశావని నిన్ను అడిగితే…? నా చదువు సంస్కారాలను నాకు తెలీని స్థితిలో ఎందుకు మార్చావని అడిగితే…? నీ మీద కోపిస్తే …? నిన్ను ద్వేషిస్తే ..?”

ఆయన మాటలకు సరస్వతి నివ్వెరపోయింది. ఆచార్యులవారు విశ్వవిరాట్ రూపంలా ఉన్నారు. భయపడుతూ చేతులు జోడించి, మెల్లగా లేచి నిలబడింది సరస్వతి. ఆయన ప్రశాంతంగా చూశి మందహాసం చేశారు.

“అమ్మా, సరస్వతీ! కలవరపడకు – ధర్మమీమాంస వద్దన్నావు కాబట్టి సాధక బాధకాలు మట్టుకే చెప్పాను. నీ బిడ్డను లాక్కుపోయే అధికారం నీకు లేనట్టే, తీసుకుని దానమిచ్చే అధికారం నాకూ లేదు. చెట్టులోని ఓ కొమ్మ ఓ రెమ్మని దానమివ్వలేదు. కాని ధర్మం వేరు – చట్టం వేరు. చట్టప్రకారం తల్లిగా నీ బిడ్డను తీసుకువెళ్ళే హక్కులు నీకే ఉంటాయి. వాటికోసం నేను కోర్టుకు వెళ్ళి నా వంశగౌరవాన్ని రచ్చకెక్కించను. అంతేగాదు – నా వంశం నిలబెట్టడం కోసం బిడ్డని దానమిమ్మని యాచించను. నా మీద, లోపల ఏడుస్తున్న ముసలిదానిమీద జాలిపడమని అర్థించను. నా యింటి దీపం ఆరిపోతే, నా బతుకు చీకటవుతుంది కానీ, లోకం చీకటవదు”

****
***

Published in: on December 1, 2012 at 7:22 pm  Comments (8)  

సత్యజిత్ రాయ్ పై నండూరి

నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాలలో సత్యజిత్ రాయ్ మరణ సందర్భంగా రాసిన వ్యాసం ఒకటి నాకెంతో ఇష్టం. ఎందుకు? అంటే ప్రత్యేకంగా ఇదీ అని కారణం చెప్పలేము. “ఆహా, ఓహో” అనినట్లు ఉండదు. ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు పెద్ద పీట వేసినట్లు ఉంటుంది. అలాగే, అన్నింటికంటే ముఖ్యంగా, సత్యజిత్ రాయ్ గురించి (కనీసం నేను విన్న, ఇపుడు నా దృష్టిలో హాస్యాస్పదం అయిన) ఒక విమర్శకు ఇది సమాధానం చెబుతుంది. 🙂

నాలుగైదేళ్ళ క్రితం, ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడప్పుడే నాకు సత్యజిత్ రాయ్ పుస్తకాలు కొంచెం తరుచుగా దొరకడం, నేను చదవడం, అభిమానిని కావడం మొదలైంది. ఆ ఫలానా వారు ఏదో అడిగితే మాటల సందర్భంలో ఇలాగ నేను సత్యజిత్ కథలు చదువుతున్నా అని, నాకు నచ్చుతున్నాయి అనీ అన్నాను. దానికి వారు – “వాడు (అవును, అలాగే అన్నారు) అంటే నాకు అలర్జీ. దేశం లో ఉన్న దరిద్రాన్ని చూపించి పేరు తెచ్చుకున్నాడు” అన్నారు. (సరిగ్గా ఇదే డైలాగు కాదు కానీ, ఇలాంటిది). నాకు ఏమి చెప్పాలో తోచింది కాదు. నిజంగా అప్పటికి నేను “పథేర్ పాంచాలి” తప్పితే మరే సినిమా చూడలేదు. నాకు సినిమా ఎంత నచ్చినా, చాలా జీవంతో కూడి కనిపించినా, అందులో దరిద్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నట్లు తోచినా (ఉదా, దుర్గ-అపు ల మధ్య ఆటపాటలు పుస్తకం గా చదివినప్పుడు ఎన్ని సార్లు చదువుకుని తరించానో!): అప్పటికి ఇంకా (ఇప్పటికంటే) చిన్న వయసు, ఆయనకు దాదాపు నా తండ్రి వయసు; పైగా నిజంగానే రాయ్ సినిమాలు నేను చూడలేదు- కనుక ఏమీ జవాబు చెప్పలేక పోయాను. కానీ, తరువాత ఇతర రాయ్ సినిమాలు చూస్తున్నప్పుడు – “అదేమిటి, ఆయన అలా అన్నాడు? ఈ సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత వైవిధ్యంతో ఉన్నాయి? పైగా రాయ్ తన సినిమాలు చాలా వాటికి సంగీతం కూడా తానే కూర్చుకుంటారు. కొన్నింటిలో గానం కూడా చేసారు (అగంతుక్ లో ఉత్పల్ దత్ కు ఈయనే పాడారని విన్నాను.). ఇవి అటు పెడితే, మంచి రచయితా, చిత్రకారుడు, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు, విమర్శకుడు గట్రా గట్రా. ఇంత మేధావి రాయ్ ని పట్టుకుని దేశంలో దారిద్ర్యాన్ని చూపి పేరు తెచ్చుకున్నాడు అంటాడా!” అనేసి మనసు రగిలిపోయింది. (ఇది “భానుమతి ఎన్టీఆర్, ఎఎన్నార్ లను పట్టుకుని ఏకవచనంలో సంబోధిస్తుంది. అంత పొగరుబోతుల రచనలు చదవాల్సిన ఆగత్యం నాకు లేదు” అని ఇదివరలో అన్న మరో మేధావి స్నేహితుడి వాదం లాగానే ఉంది నాకు.).

కొన్నాళ్ళ క్రితం నండూరి వారి సంపాదకీయాలలో రాయ్ మరణ సందర్భంలో వచ్చిన సంపాదకీయంలో చదివిన ఈ చివరి పేరా ఎట్టకేలకు ఇలాంటి తరహా విమర్శకు సమాధానం చెప్పింది నాకు:

“చివరగా ఒక మాట. ప్రపంచమంతా జేజేలు పలికింది కానీ, భారతీయ చలనచిత్ర ప్రముఖులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకొనకపోవడం దురదృష్టం. భారతీయ దారిద్ర్యాన్ని తన చిత్రాలలో ప్రదర్శించి పాశ్చాత్యుల ప్రశంసలు సంపాదించుకున్న వాడిగా ఆయనను కొందరు పరిగణించడం వారి మేధా దారిద్ర్యానికి చిహ్నం. తానూ కళాఖండాలు తీస్తున్నానని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అందరూ చూసి ఆనందించే చిత్రాలు తీయడమే తన ధ్యేయమని, వ్యాపార విజయ దృక్పథం ఉన్నంత మాత్రాన కళామూల్యాలు లోపించనక్కరలేదని ఆయన విశ్వాసం. ఆ మాటకు వస్తే తనకు స్పూర్తి ఇచ్చిన వారిలో అమెరికన్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాబర్ట్ ఫ్లాహేర్టీ, సోవియట్ దర్శకుడు అలెక్జాండర్ డోవ్జెంకో లతో పాటు ఎందఱో హాలీవుడ్ దర్శకులు కూడా వున్నారనేవాడు రాయ్. సత్యజిత్ రాయ్ భారతీయ సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. నేడు ఆయన లేడు. ఆయన చిత్రాలు ఉన్నాయి. ఆయన ప్రతిభ ఉంది.”
-April 25, 1992.

Published in: on August 31, 2012 at 6:00 am  Comments (9)  

మహిళావరణం-13 (ముగింపు)

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

118 మంది గురించీ చదివేశాక, మొదటికి వచ్చాను నేను. మరొకసారి రచయిత్రులు రాసిన ముందుమాటా, తరువాత (మొదలుపెట్టినప్పుడు ఆట్టే దృష్టి పెట్టి చదవని) “నిరుడు కురిసిన హిమసమూహాలు” పేరిట కొంత చారిత్రక నేపథ్యం తెలిపే వ్యాసమూ మళ్ళీ చదివాను. ఒక రెండు ముక్కలు మళ్ళీ ఈ పుస్తకంలోని విశేషాల గురించి బ్లాగాలి అనిపించింది… నిజం చెప్పాలంటే ఆ వ్యాసం మొత్తంగా నాకు కాస్త బోరు కొట్టింది కానీ, అందులో ప్రస్తావించిన కొన్ని కథలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.

“ఆంధ్రదేశంలో మొదటగా క్రైస్తవ మతం తీసుకున్నది ఒక స్త్రీ. చిత్తూరు జిల్లాలో పుంగనూరులో 1701వ సంవత్సరంలో ఒక వితంతువు తన నలుగురు పిల్లలతో క్రైస్తవ మతంలోకి మారింది. 1805లో లండన్ మిషనరీ సొసైటీ విశాఖపట్నంలో తన కేంద్రాన్ని స్థాపించి ఒక బాలికల పాఠశాలని నెలకొల్పింది..” ఇలా సాగిన పేరాలో ఆ “మొదట మతం పుచ్చుకున్నది ఒక స్త్రీ” అన్న సంగతి చాలా ఆసక్తికరంగా అనిపించింది. విచిత్రంగా కూడా అనిపించింది – ఆ విషయం ఇన్ని సంవత్సరాల తరువాత ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డం.

ఇక, వితంతు వివాహాల గురించి చెప్పిన కథ: ఒక బ్రాహ్మణ యువకుడు వితంతువైన తన చెల్లికి జుట్టు తీయించి ముతక బట్టలు కట్టించాలని, బట్టలు తెచ్చి ఆవిడకిచ్చాడట. ఆవిడ తనకు చాలినన్ని చీరలు ఉన్నాయనీ, కావలిస్తే వదినెకి ఇచ్చుకొమ్మనీ చెప్పిందట. విధవలు కట్టుకోవాల్సినవి నా భార్య కట్టుకోవడమేమిటి? అని అతను కోప్పడితే, రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నాను, నాకూ అవి అక్కర్లేదు అన్నదట 🙂 (అఫ్కోర్సు, కాస్త అతివాదిలా ఆలోచిస్తే, “విధవలు కట్టుకునే బట్టలేవిటి నీ మొహం!” అని దాడి చేయాలి. కానీ, బహుశా ఆ కాలానికి ఈవిడ స్పందనే విప్లవాత్మకం అనుకుంటాను!). ఈ సంఘటన తరువాత జరిగింది మాత్రం అత్యంత ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశం – ఈ అమ్మాయి పెళ్ళిని వీళ్ళ అన్న బంధువుల సాయంతో ఆపేశాడట. కానీ, తనకి నచ్చిన వ్యక్తితో వివాహ ప్రస్తావన లేకుండా సంబంధం పెట్టుకోవడానికి మొత్తం బంధువర్గమూ అనుమతించిందట!!!!!!

ఆ కాలంలో వితంతువులు ఎవరితోనూ వెళ్ళిపోవడమూ [(అ)సభ్యసమాజపు భాషలో లేచిపోవడం], లేదా అలా వెళ్ళాక మోసపోయి తిరిగిరావడమూ – వీటిల్లో “తిరుగుబాటు”ను చూడమని రచయిత్రులు ఉద్భోదించేవరకూ ఆ కోణం నాకు తట్టలేదు. అఫ్కోర్సు, అలాంటివి అన్నీ గానీ, మామూలుగా జనాలు ఇంట్లోవాళ్ళకి తెలీకుండా ఎవరితోనో వెళ్ళిపోయే అన్ని సంఘటన్లూ తిరుగుబాటే అని మనం అనుకోనక్కర్లేదు. కానీ, ఇపుడు ఆలోచిస్తే అనిపిస్తుంది – మన చుట్టూ వినబడే అభిప్రాయాలు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయో కదా! అని. నిన్ననే Chimamanda Ngozi Adichie అన్న నైజీరియా రచయిత్రి ఇచ్చిన TED Talk – “The Danger of a Single Story” విన్నాను. ఒకే దృక్కోణంలో కథలు వింటూ ఉంటే మనం ఎలా ఆ ఆలోచనావిధానానికి అలవాటు పడిపోతామో చెప్పే ఇరవై నిముషాల ప్రసంగం అది. తప్పకుండా వినాల్సినది.

….ఇక, స్త్రీవిద్య, సంఘ సంస్కరణ, వైద్యం, స్వతంత్ర పోరాటం, హక్కుల కోసం పోరాటాలు, సాంస్కృతిక సాహిత్య కృషీ – ఇలాగ ఈ వ్యాసంలో అన్ని కోణాల నుండీ స్త్రీ చైతన్యం గురించీ ఒక విహంగ వీక్షణం ఉంది. భద్రంగా పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ వ్యాసం.

పుస్తకం లో నాకు నచ్చని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ, ఈ పుస్తకం గురించి వివరంగా మరొకసారి చర్చిద్దామనే అనుకుంటున్నా కనుక, అక్కడ చెప్పుకుంటాను. మరొక్కసారి నాకు ఇంతమంది గురించి పరిచయం చేసిన – వోల్గా, వసంత కన్నాబిరాన్, కల్పన కన్నాబిరాన్ గార్లకి, ఫొటొగ్రఫర్ గుడిమెల్ల భరత్ భూశణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ…ఇతి వార్తాహ.

PS: వీళ్ళు రాసిన ముందు మాటలో తమకి స్పూర్తి కలిగించిన అంశాల్లో “Daughters of Maharastra” అన్న పుస్తకం ప్రస్తావన ఉంది. మా అద్భుతశక్తులు గల గ్రంథాలయంలో అది కూడా దర్శనమిచ్చేసింది కనుక, బహుశా నెక్స్ట్ సిరీస్ దానిలోని వారిపైనే ఏమో! (ఈ లెక్కలో నేనే ఫెమినిస్టు ఉద్యమాల్లోనూ చేరిపోకుండా ఉండాలని కోరుకోండి! ):-)

Published in: on July 14, 2012 at 6:00 am  Comments (1)  
Tags: ,

మహిళావరణం-12

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

111. భాగ్యలక్ష్మి (1962-1992): విప్లవ నాయకురాలు. ఒకసారి తోటి విప్లవ కార్యకర్తను పోలీసులు అందరికళ్ళ ఎదుటా కొడుతూ తీసుకెళ్ళి చంపి ఆ తరువాత అతన్ని అరెస్టు చేయలేదని చెబితే, భాగ్యలక్ష్మి ధైర్యంగా కోర్టులో అసలు సంగతి చెప్పి సంచలనం సృష్టించారట. పోలీసుల ఎన్‌కౌంటర్ లో మరణించారు.

112. మున్నంగి సువార్త (1963): కారంచేడులో ఒక అగ్రకులస్థుడి దురాగతాన్ని సువార్త ఎదిరించడంతో ఆ సంఘటన తరువాత అక్కడ దళితుల ఊచకోతకూ, వారిలో పోరాట స్పూర్థికీ దారితీసింది. “కారంచేడులో మాదిగలు చేసిన పోరాటానికి ముందు దలిటుల చైతన్యం వేరు, తరువాతి చైతన్యం వేరు” అని రాసారు రచయిత్రులు. అయితే, విషయం ఏమిటంటే, కనీసం ఈ పుస్తకం వచ్చిన నాటికి నిందితులు శిక్ష తప్పించుకున్నారు! (ఈ సంఘటన ఏమిటి? అని నాలాగే సందేహం కలిగిన వారికోసం – నాకు ఆన్లైన్ లో దొరికిన కత్తి పద్మారావు గారి వ్యాసం ఇదిగో)

113. బొర్లం స్వరూప (1966-1992): పీపుల్స్ వార్ నాయకురాలు. జ్యోతక్కగా ప్రసిద్ధి. విప్లవంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసుల ఎంకౌంటర్ లో మరణించారు.

114. పాటిబండ్ల రజని (1966): ప్రముఖ స్త్రీవాద కవయిత్రి.

115. పూర్ణిమా రావు (1967) : ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి.

116. కరణం మల్లీశ్వరి (1975): ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ పతకం గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా పొందారు.

117. కోనేరు హంపి (1987): ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

***
…అయిపోయారు అందరూ. కాకపోతే, చివర్లో ఇచ్చిన లిస్టులో 118 అని ఉంది…ఎవర్నో మిస్సయిపోయా ఈ బ్లాగు టపాల్లో అని వెదికితే, మధ్యలో సురభి కమలాబాయి తరువాత “కొమ్మూరి పద్మావతీదేవి” పేజీ మిస్సయ్యా అని అర్థమైంది.

118. కొమ్మూరి పద్మావతీదేవి (1908-1970): ప్రముఖ నాటకరంగ కళాకారిణి. స్త్రీలసమస్యల గురించి రేడియో ప్రసంగాలు కూడా ఇచ్చారు.

Published in: on July 13, 2012 at 6:00 am  Leave a Comment  
Tags: ,

మహిళావరణం-11

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********
101. జమీలా నిషాత్ (1935): ప్రముఖ ఉర్దూ స్త్రీవాద రచయిత్రి. సామాజిక అసమానతలు గురవుతున్న ముస్లిం స్త్రీల గురించి, మతసామరస్యం గురించీ పని చేస్తున్నారు.

102. ప్రతిభా భారతి (1956): రాజకీయ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనసభకు మొదటి మహిళా స్పీకర్. వివిధ శాఖలకు మంత్రిగా, వివిధ కమిటీల సభ్యురాలిగా కూడా వ్యవహరించారు.

103. గొర్రె సత్యవతి (1956): రూరల్ అవేర్నెస్ డెవెలప్మెంట్ సొసైటీ పేరిట ఒక స్వచ్చంద సంస్థను పూర్తిగా మహిళలతో, మహిళలకోసం పని చేసేలా 1991 లో స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ప్రతికూల పరిస్థితులను సైతం జయిస్తూ స్త్రీల అభ్యున్నతి కోసం, వారిలో చైతన్యం కోసం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

104. అరుణ ఎం.బహుగుణ (1957): ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా ఐ.పీ.యస్ అధికారిణి.

105. సి.పుణ్యవతి (1957): విద్యార్థి దశ నుండీ వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లోనూ, మహిళా ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా సంఘంలో కూడా చాలా కాలం పనిచేశారు.

106. కొండేపూడి నిర్మల (1958): ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. వృత్తిరిత్యా జర్నలిస్టు.

107. శోభాలత (1958): సినీరంగంలో మేకప్ కళాకారిణిగా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని నిలబడ్డారు, నంది అవార్డులు కూడా పొందారు. బ్యూటీపర్లర్ మొదలుపెట్టీ శ్త్రీలకి ఆ రంగంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. “మేకప్ రంగం స్త్రీలది కాదని, ఆ పని ఆపేయాలనీ” దక్షిణ భారత సినీ కళాకారుల ఫెడరేషన్ (ఫెప్సీ) ఆందోళన చేసిందట శోభాలత కి 1992లో రెండు నందులు వచ్చినప్పుడు!

108. రంగవల్లి (1959-1999): విద్యార్థి దశ నుంచే సి.పి.ఐ (ఎం.ఎల్) సభ్యురాలిగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నుండి “విజృంభణ” పత్రిక తీసుకొచ్చి విజయవంతంగా నడిపారు. బాగా చురుగ్గా గోదావరి లోయలోని అడవుల్లో పనిచేస్తున్నప్పుడు పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపారు.

109. ఫాతిమా బీ (1960): “కాల్వ” (కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం) సర్పంచిగా పని చేసి, గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇందుకుగాను 1998లో యూ.ఎన్.డీ.పీ. వారి నుండి అవార్డు అందుకున్నారు. (అవునవును, అప్పట్లో కర్నూల్లో మా స్కూల్లో ఈ విషయం గురించి చెప్పుకున్నాం! )

110. విమల (1960): విప్లవ రచయిత్రి. అనేక రాజకీయ సాంఘిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

***
…తక్కిన వారిపై వచ్చే టపాలో.
(ఊరికే మొదటిపేరు చెప్పి వదిలేస్తే, బహుశా ఆ ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో కానీ, ఈ పుస్తకం చదివే అవకాశం ఉన్న నాబోటి సామాన్యులకి కాదు! ఏం విమల? ఏం రంగవల్లి? ఇప్పుడు వీళ్ళ గురించి వివరాలు తెలుసుకోవాలి అనిపిస్తే, ఏమని వెదుకుతాం?)

Published in: on July 12, 2012 at 6:00 am  Comments (1)  
Tags: ,