చాన్నాళ్ళకి మళ్ళీ శ్రీపాద వారి ఆత్మకథ చదవడం మొదలుపెట్టాను. ఈసారి, ఆయనకి కథారచన చేయాలన్న కోరిక చిన్ననాడు ఎంతబలంగా ఉండేదో వర్ణించిన భాగం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. అందుకని, ఇక్కడ టైపు చేసుకుంటున్నాను.
******
…ఇంత కార్యక్రమంలోనూ, మధ్యాహ్నం చెప్పుకున్న కొత్త పాఠం వల్లించుకోడం తడువుగా ఎగిరిపోయి దేవాలయ గోపురం పైఅంతస్థున కూచునేవాణ్ణి, ఏమిటేమిటో కలలు కంటూ నేను.
నాకు జ్ఞాపకం వుండినంత వరకూ, ప్రయత్నపూర్వకంగా నేను కల్పనకు పూనుకోడానికి మొదలు ఆ గోపురం మీదే.
అక్కణ్ణుంచి చూస్తే, ఎదట, వరసగా, విరగబూసిన బొగడచెట్ల శిఖరాలు – ఎడమవైపున ముడుచుపోయిన కలవలతో నిండివున్న కోనేరు – వెనక, చిరుగంటలతో ధ్వజస్తంభాగ్రమూ మిలమిల మెరిసే పసిడికుండతో దేవాలయ శిఖరమూను – కుడివైపున, చేతికందేటట్టు మనిషి కలవిగాని గెలలతో కొబ్బరిచెట్ల తలలు – ఇలాగ, ఆ పరిసరాలందుకనుకూలంగానే ఉండేవి.
దీనికి సాయం అక్కడ నాలుగువైపుల నుంచీ కమ్మని గాలి రివ్వున కొట్టేది, మధ్యమధ్యమాత్రం గబ్బిలాల కంపుతో కలుషితం అయిపోతూ.
అయితే, భాష రాదు, అనుభవం లేదు, భావాలు పుట్టవు. అయినా, వినిఉండిన కొద్ది కథలూ ఆధారంగా, చక్కని కథలు కల్పించాలనీ, రసవంతంగా చెప్పాలనీ సంకల్పమూ, మొదటి ప్రయత్నమూ కూడా అక్కడే నాకు.
వల్లూరిలో నేను పడ్డ మరోప్రపంచంలో, మళ్ళీ నాకిది యింకో ప్రపంచం.
నేను లేశమూ సంస్కారం లేనివాణ్ణే అయినా, ఆ ప్రపంచ స్వభావం అది కనక, అందులో పడ్డ వెంటనే నిర్థారణ చెయ్యలేని ఆవేశం యేదో తలముంకలయి పరవశుణ్ణి చేసేసేది నన్నుతరక్షణంలో.
అందువల్ల గోపురం దిగడం అంటే నాకెంతో బాధగా ఉండేది.
… … …
అది రచనాకాదు, రచనాసమాధి అసలే కాదు. సమాధి అంటే యేమిటో ముక్కూ మొహమూ కూడా నాకప్పుడేమీ తెలియదు – అయినా, సగంలో లేచి రావడం అంటే అప్పటికే నాకు బాధగా ఉండేది.
…
…
****
శ్రీపాద రచనాభిలాష,చేసిన రచనను అచ్చులోచూసుకొని నలుగురి ప్రతిస్పందనను తెలుసుకోవాలనే తపన ఆరోజుల్లో మరిపిస్తుంది మురిపిస్తుంది.రచన చేయడంకోసమే ఆయన జీవించినట్లు అగుపిస్తుంది!ఒక్క చేతితో ఎన్నెన్ని రచనలు చేసాడు.కథలు,నవలలు,ఆత్మకథ!ఇంత output మనం రెండుజన్మలెత్తినా సాధించ లేము!క్షణక్షణం ఊపిరి తీస్తున్నట్లు సాహిత్య రచన చేసి జీవితాంతం వరకు బండెడు పుస్తకాలు వేయాలని ఆయన అభిలాష!ఆరోజుల్లో ఒక పుస్తకం అచ్చువేసుకోవడమంటే ఒక యజ్ఞం,అమ్ముకోవడం మరింత కష్టం!శ్రీపాద ఆత్మకథ చదివి నాలాంటివాళ్ళు బుద్ధి తెచ్చుకొని శేషజీవితంలోనయినా విరివిగా రచనలు చేయడానికి ప్రయత్నించాలి!
శ్రీపాద రచనాదాహం గూర్చి సౌమ్య గారు మంచి టపా రాసి ఆయన్ని ఒకసారి స్మరించుకున్నారు!వారి రచనదాహం,జిజ్ఞాస,పిపాస అంతం వరకు వారినివీడిపోలేదు!
శ్రీపాద రచనలేవైనా తెలుగు తేనియల మాధుర్యంతో అలరిస్తాయి. ఇక ఆయన ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ అయితే ఎన్నిసార్లు చదివినా, అన్నిసార్లూ అర్ధశతాబ్దం వెనక్కు తీసుకెళ్ళి ఓలలాడించేస్తుంది.
సౌమ్యగారూ! ఆయన రాతలో కొంత కోట్ చెయ్యడం తో పాటు, మీ అభిప్రాయాన్ని, విశ్లేషణని, సమీక్షగా రాస్తే బావుంటుంది. నిరాశపరచరని భావిస్తాను.
రాజా.
oh superb sowbyaji