నిన్న కాసేపు నికేతా మెహ్తా కేసు గురించి చదువుతూ ఉన్నాను. మొదట దీనిపై ఆసక్తి కలిగించింది The Statesman దినపత్రిక లో నిన్న వచ్చిన వ్యాసం. తరువాత Times of India ఆన్లైన్ వ్యాసాలు చదివాక ఈ ఉదంతం పై నా టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. ఈ కేసు గురించి వివరంగా రాయబడ్డ బ్లాగు టపా ఇక్కడ.
క్లుప్తంగా చెప్పాలంటే, నికేతా మెహ్తా తనకి పుట్టబోయే బిడ్డకి గుండె జబ్బు ఉండే ప్రమాదం ఉందనీ, పుట్టిన క్షణం మొదలుకుని జీవితాంతం పేస్మేకర్ వాడాల్సిన అవసరం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిసి తనకి అబార్షన్ కి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మన దేశపు చట్టాల ప్రకారం ఇరవై వారాలలోపే అబార్షన్ చేసుకోవాలట. కానీ ఈవిడకి ఇరవై నాలుగు వారాలకి ఈ విషయం తెలిసింది కనుక కోర్టుని చేరింది విషయం. హైకోర్టేమో ఆమె తరపు వాదన తోసిపుచ్చింది. ఈ అబార్షన్ చట్టసమ్మతం కాదు అని తేల్చింది.
ఈ కేసు ఫలితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి. ఓ పక్క ఆ పుట్టబోయే బిడ్డ కి జీవితాంతం బాధలు పడే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ కి, అదీ తల్లిదండ్రులు కోరుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని. అబార్షన్ నేరమా? ఘోరమా? తప్పా? ఒప్పా? అన్న మీమాంస కాదు ఈ టపా. ఈ కేసు విషయం లో ఏది న్యాయం అన్న చర్చ కోసం. మామూలుగా అబార్షన్ నేరం అనుకున్నాకూడా, ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేరం చేస్తే ఓ జీవితాన్ని జీవితాంతం చస్తూ జీవించే యాతన నుండి తప్పించవచ్చు కదా? ఈ కేసులో ఒక వాదన ఏమి రావొచ్చు అంటే – “ఒకవేళ ఇవేమీ లేకుండా బిడ్డ మామూలుగానే పుడితే…అప్పుడీ అబార్షన్ ఆ బిడ్డని చంపేసినట్లే కదా?” అని. కానీ, అది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, శిశువు గుండెజబ్బుతో పుట్టే అవకాశం ఉన్నప్పుడు – ఆ లాజిక్ పని చేస్తుందా? జబ్బుతో పుట్టిన బిడ్డ తో తల్లిదండ్రుల జీవితం, పుట్టిన శిశువు జీవితం, వీళ్ళలో జరిగే మానసిక సంఘర్షణా – ఇవన్నీ ఆలోచిస్తే మరి?
తొమ్మిదేళ్ళ వయసు నుండి పేస్మేకర్ వాడుతున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ మనిషి కథనం ప్రకారం జీవితాంతం దానిపై ఆధారపడి బ్రతకాల్సిన మనుషులు కూడా మామూలు జీవితం గడపొచ్చట.ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ట్రీట్ చేయొచ్చని అతను అన్నాడు. ఈ విషయం బానే ఉంది వినడానికి. అయితే, తెలిసి తెలిసీ…. అన్న భావన ఆ తల్లిదండ్రుల్లో రావడంలో నాకేమీ అసహజత్వం కనబడ్డం లేదు. పైగా, పేస్మేకర్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నదట. జీవితాంతం ఆ ఖర్చు భరించే స్థోమత తల్లిదండ్రులకి ఉండాలి కదా.
“”But I will have to now stop working. We are not that rich to afford full-time nannies. Finances will certainly be one concern.”
-అన్న మాటల్ని బట్టి చూస్తే నికేతా దంపతుల అసహాయత అర్థమౌతోంది కదా. దానికి జవాబు గా బోలెడు సంస్థలు ముందుకొస్తున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తుంది జీవితాంతం – వంటి వాదనలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పుడిస్తున్న వాగ్దానాలే-వేటికీ గ్యారంటి లేదు అన్నది ఒక విషయమైతే, ఇలా ఎన్ని కేసులకని సాయం చేస్తారు? అన్నది మరో విషయం. ఈ కేసు తరువాత తమకి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కేసులు ఎక్కువైపోయాయంట కాబోయే తల్లిదండ్రుల్లో. ఈ విషయానికి సంబంధించి ఉపయోగపడే రకరకాల టెస్టుల గురించిన సమాచారం ఇక్కడ.
మన అబార్షన్ చట్టాల ప్రకారం 26 వారాల తర్వాత తల్లి కి ప్రమాదమైనప్పుడు అబార్షన్ చేసుకునే సౌలభ్యం ఉందట కానీ, బిడ్డ పరిస్థితి బాలేకపోతే కాదట. ఇది మరో వింత నాకు. ఏం? పుట్టాక ఆ బిడ్డ మాత్రం మనిషి కాదా? అలా అబార్షన్ ఆపాక పుట్టిన శిశువు ఏదో కారణానికి మరణిస్తే మాత్రం ఆ తల్లికి క్షోభ కలగదా?
పుట్టబోయే బిడ్డ పుట్టాలా వద్దా అన్న విషయం లో తల్లి అభిప్రాయానికి విలువ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? వంటివి మరిన్ని ప్రశ్నలు. అసలు బాధ్యత గల ఏ తల్లీ కారణం లేకుండా తనకి పుట్టబోయే బిడ్డను చంపాలనుకోదు అన్నది మరొక పాయింటు. అబార్షన్ గురించి తల్లికి కొంత స్వేఛ్ఛ ఉండాలని నా అభిప్రాయం. పెంచడానికో, పుట్టించడానికో తల్లికి ఒకవేళ వ్యతిరేకత ఉంటే, ఆమెని ఆమె తాలూకా మనుషులు ఒప్పించలేకపోతే…బలవంతంగా కోర్టు బిడ్డని పుట్టనిచ్చాక ఆ బిడ్డ పరిస్థితి సాఫీగా ఉండాలనేముంది? నికేతా కేసు గురించి కాదు ఇది అంటున్నది. ఆ కేసులో కారణాలు వేరు. ఆ కేసులో నేనైతే నికేతాకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది more general context.
“”But what is disappointing is that we have been proved to be fools. We are educated fools. People in remote areas go to quacks for an abortion. The lesson here being sent out is: don’t follow the law. We are being punished for being law-abiding citizens.” -అన్న మాటల్లో అర్థమౌతున్నాయి నికేతా మెహ్తా ఈ కేసు విషయం లో అనుభవించిన క్షోభా, ఫలితం ఆమెలో కలిగించిన అసంతృప్తీ. “We have initiated awareness about the abortion law and that it needs to change with time and changing societal standards and medical advances,’’ – అన్నప్పుడు కాస్త ఆశాభావం కూడా కనిపించింది. (మూలం)