సాంకేతికాభివృద్ధి ఎందుకు? అన్న ప్రశ్న నాకు కలిగినప్పుడల్లా నాకు నేను చెప్పుకునే సమాధానం, నేను బలంగా నమ్మే సమాధానం – మనిషి మేధస్సును అర్థం చేసుకునేందుకు కాదు, మనిషి బ్రతుకు సులభతరం చేయడానికి – అని. ఇది సరైన అభిప్రాయమా? కాదా? అన్న చర్చ పక్కన పెడితే, ఇటీవలి MIT Technology Review వారి ఇండియన్ ఎడిషన్ జులైనెల సంచికలో ఒక వ్యాసం చదివాను. “సాంకేతికాభివృద్ధి ఇందుకు” అనిపించింది. ఇదొక్కటే ఉదంతం అని నా ఉద్దేశ్యం కాదు. కానీ, ఇలాంటి ఉదంతాలకి నా వంతు ప్రచారం నేను కల్పిస్తే, మీ వంతు ప్రచారం మీరు చేస్తే, వారికి ప్రోత్సాహంగా ఉండటమే కాదు. ఏదో చేయాలనుకుని, చేయలేక, నిస్పృహతో పరిస్థితుల్ని నిందించే వారికి మేలుకొలుపుగానూ, సాంకేతికతను జన బాహుళ్యానికి మేలు చేకూర్చడానికి ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించే వారికీ ప్రోత్సాహకరంగా ఉంటుందనిపించింది.
విషయానికొస్తే – పాఠశాలలో చెప్పే పాఠాలను ఈ-పాడ్ అనబడు ఐపాడ్ తరహా పరికరం సహాయంతో విద్యార్థులకి అందించడం. ఇది మొదట అమెరికాలో అమెరికన్ విద్యార్థులకే మొదలైనా కూడా, ఈ వార్తాంశం ఇది భారద్దేశంలోని ఓ మారుమూల పల్లెకి దీన్ని ఎలా చేర్చారు, దాని వల్ల పిల్లలకి కలిగిన లాభమేమిటి? అన్న విషయం గురించి చెప్పింది. ఇది సోలార్ పవర్ తో నడుస్తుందట. వివరాలు ఆ వ్యాసంలో ఉన్నాయి.
“ePod is set to bring about a renaissance in the way education is administered and managed, especially in rural and government schools with inadequate infrastructure.”
“The impact of this technological innovation will be felt few years from now when millions of Nagarajs get to take home their ePODs. “
-ఈ ప్రయత్నం విజయవంతంగా మన దేశంలోని పాఠశాలల్లో – ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరింపబడితే, మన విద్యావ్యవస్థలో మార్పు రాగలదేమో. అలాగే, ఎక్కువ మందిని చదువుకునే దిశగా లాగగలదేమో.