విద్యావ్యవస్థలో విప్లవం తేగల “ఈపాడ్ లు”

సాంకేతికాభివృద్ధి ఎందుకు? అన్న ప్రశ్న నాకు కలిగినప్పుడల్లా నాకు నేను చెప్పుకునే సమాధానం, నేను బలంగా నమ్మే సమాధానం – మనిషి మేధస్సును అర్థం చేసుకునేందుకు కాదు, మనిషి బ్రతుకు సులభతరం చేయడానికి – అని. ఇది సరైన అభిప్రాయమా? కాదా? అన్న చర్చ పక్కన పెడితే, ఇటీవలి MIT Technology Review వారి ఇండియన్ ఎడిషన్ జులైనెల సంచికలో ఒక వ్యాసం చదివాను. “సాంకేతికాభివృద్ధి ఇందుకు” అనిపించింది. ఇదొక్కటే ఉదంతం అని నా ఉద్దేశ్యం కాదు. కానీ, ఇలాంటి ఉదంతాలకి నా వంతు ప్రచారం నేను కల్పిస్తే, మీ వంతు ప్రచారం మీరు చేస్తే, వారికి ప్రోత్సాహంగా ఉండటమే కాదు. ఏదో చేయాలనుకుని, చేయలేక, నిస్పృహతో పరిస్థితుల్ని నిందించే వారికి మేలుకొలుపుగానూ, సాంకేతికతను జన బాహుళ్యానికి మేలు చేకూర్చడానికి ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించే వారికీ ప్రోత్సాహకరంగా ఉంటుందనిపించింది.

విషయానికొస్తే – పాఠశాలలో చెప్పే పాఠాలను ఈ-పాడ్ అనబడు ఐపాడ్ తరహా పరికరం సహాయంతో విద్యార్థులకి అందించడం. ఇది మొదట అమెరికాలో అమెరికన్ విద్యార్థులకే మొదలైనా కూడా, ఈ వార్తాంశం ఇది భారద్దేశంలోని ఓ మారుమూల పల్లెకి దీన్ని ఎలా చేర్చారు, దాని వల్ల పిల్లలకి కలిగిన లాభమేమిటి? అన్న విషయం గురించి చెప్పింది. ఇది సోలార్ పవర్ తో నడుస్తుందట. వివరాలు ఆ వ్యాసంలో ఉన్నాయి.

“ePod is set to bring about a renaissance in the way education is administered and managed, especially in rural and government schools with inadequate infrastructure.”
“The impact of this technological innovation will be felt few years from now when millions of Nagarajs get to take home their ePODs. “

-ఈ ప్రయత్నం విజయవంతంగా మన దేశంలోని పాఠశాలల్లో – ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరింపబడితే, మన విద్యావ్యవస్థలో మార్పు రాగలదేమో. అలాగే, ఎక్కువ మందిని చదువుకునే దిశగా లాగగలదేమో.

Published in:  on July 28, 2009 at 10:30 am Comments (7)

Confusion …Confusion!

ఇవాళ ఈనాడు పేపర్లో ఒక చిన్న వార్త ఉండింది. హైదరాబాద్ లోకల్ ఎడిషన్లో చూసినట్లు గుర్తు. ఈనాడు సైటులో నుండి ఈ వ్యాసానికి లంకె ఇద్దామని చూసాను కానీ, వ్యాసం పేరు గుర్తు లేక..వెదకలేకపోయాను. ఈపేపర్ నుండి దిగుమతి చేసిన పీడీఎఫ్ ఇక్కడ. ఇంతకీ విషయం ఏమిటంటే :

పాత కాలం నాటి తెలుగు పత్రికలన్నీ (ఆంధ్రపత్రిక పేరైతే గుర్తుంది. మిగితావి గుర్తు లేవు. నేను ఆ వ్యాసాం చాలా క్యాజువల్ గా చూసి వదిలేశా నిజానికి) డిజిటైజ్ చేస్తున్నామనీ, త్వరలో ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులో అవన్నీ పెడతామనీ ఆ వార్తలో అన్నారు. అక్కడ ఇది ప్రారంభిస్తున్న దృశ్యం కూడా ఉంది. చదివి, ఓ…మంచి ఆలోచనే..అనుకున్నా. ఇప్పుడు ప్రెస్ అకాడెమీ వెబ్సైటు కోసం వెదుకుతూ ఉంటే, నాకు 2004 నాటి మరో వార్త – హిందూ పత్రిక పేజీల్లో కనబడ్డది. (అది ఇక్కడ.)

అంటే…ఐదేళ్ళ బట్టీ వీళ్ళు… చేద్దాం అనుకుంటూనే ఉన్నారనా? లేక…మధ్యలో ఏమన్నా ఐందా? పైగా, అప్పటి న్యూసైటెం లో “The academy had already taken up digitisation of old newspapers on a small scale and so far about 16 lakh pages had been digitised. A sum of Rs. 18 lakhs had been spent so far and the academy intended to take up a massive digitisation project covering all major newspapers and weeklies published from the State. A grant of Rs. 30 lakhs had been made to the academy, he said. ” అన్నారు. “He said all newspapers which would be digitised would be preserved and compact discs would be made. This would involve about Rs. 1 crore, he said adding the academy was serious about going ahead with the project.” అని కూడా అన్నారు.

ఇప్పుడేమో మళ్ళీ అరవై లక్షల నిధులు మంజూరు చేసారంట! వీళ్ళ పనే బాగుందే! అనుకున్నా.

ఇంతకీ, నాది ఇంకో సందేహం…ఇవన్నీ చేసి, నిజంగానే ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని, ఆ కోట్లన్నీ తగలేసి దానిలో ఎంతో కొంత నిజంగా దీనిపై ఖర్చుపెట్టి మన వాళ్ళు దాన్ని ఆ ప్రెస్ అకాడెమీ వెబ్సైటేదో (నాకు కనబళ్ళేదు ఇంకా)..అందులో పెట్టారనుకుందాం…మనమెలా చదువుకోవాలన్నట్లు? ఏదో 1940 మార్చి ఐదున ఏం జరిగిందో మనకి అవసరమంటారా? లేక, ఫలానా సభలో ఫలానా వారేమన్నారో? అన్న విషయం కోసం వెదుకుతామా? – అంటే, నా ఉద్దేశ్యం – Search సౌలభ్యం ఉండాలి కదా అని. వీటన్నింటికీ సర్చి సౌకర్యం ఎప్పటికొస్తుందో లెండి, అది వేరే విషయం. కౌముది వారు ఇదివరలో వాళ్ళ పీడీఎఫ్ ఫైళ్ళలో keywords index చేయడం ద్వారా శోధన కొంతవరకూ పెట్టారు. (ఇది సెప్టెంబర్ 2007 ప్రాంతంలో వారి సైటులో ఉన్న ప్రకటన. అప్పట్లో వారిని ఏం చేస్తున్నారని సంప్రదిస్తే, yuyam వెబ్సైటు వారి ద్వారా ఇది చేస్తున్నామని చెప్పారు.

ఏమిటో… ముందు 2004 లో లక్షలు పోసిన వాటికి కాళ్ళొచ్చి ఎటుపోయాయి? అని అడిగితే చెబుతారంటారా?

Published in:  on May 19, 2009 at 10:52 am Comments (1)

“మాలపల్లి” నవలలోని ఒక సంభాషణ

నేను ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపల్లి” చదువుతూ ఉంటే, ఒక సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని యధాతథంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను:

జోతి: అమ్మా! రేపెక్కడికే అయ్యా, నీవు పోవడం
వెంకటదాసు: ఎక్కడకా? దేవుడి దగ్గరకు
జో: దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా?
మాలక్ష్మి: ఆ,ఆ. దేవుడు రానిస్తాడు.
జో: ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి?
మా: రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా
జో: మన గుడిలోకి వస్తాడా దేవుడు?
మా: ఆహా! ఎవరు కట్టించుకున్నా వస్తాడు. ఆయనకంటు లేదు.
రామదాసు:పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా? అన్నారు.
వెం: నీదంతా అద్వయితం. అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు. మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి?

- ఈ ఒక్క సంభాషణలోనే నాకు “దేవుడు” గురించిన రకరకాల కోణాలను స్పృశించినట్లు అనిపించింది. జోతిది అమాయకత్వం, రామదాసుది “సత్యమే శివం” లో కమల హాసన్ పక్షం తరహాది. మాలక్ష్మిది దేవుడికి అందరూ సమానమే అన్న భావం, వెంకటదాసుది దేవుడికి, తనవారు దేవుణ్ణి చూడటం కోసం గుడి కట్టించాలన్న తాపత్రేయం. నాకెందుకో ఈ సంభాషణ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా, చాలా చాలా ప్రభావితం చేసేదిగా అనిపిస్తోంది.

ఇదే మూసలో ఉన్న మరో డైలాగు : “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”

Published in:  on November 17, 2008 at 11:00 am Comments (7)

రెండు వార్తలు

మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ పేజీలో చూడొచ్చు.

మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది – ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్‍లైన్ చేసేసింది :) ) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం – ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా! ;) లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.

రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్‍ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్‍ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్‍ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

Published in:  on August 27, 2008 at 9:10 am Comments (6)

నికేతా మెహ్‌తా కేసు

నిన్న కాసేపు నికేతా మెహ్తా కేసు గురించి చదువుతూ ఉన్నాను. మొదట దీనిపై ఆసక్తి కలిగించింది The Statesman దినపత్రిక లో నిన్న వచ్చిన వ్యాసం. తరువాత Times of India ఆన్లైన్ వ్యాసాలు చదివాక ఈ ఉదంతం పై నా టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. ఈ కేసు గురించి వివరంగా రాయబడ్డ బ్లాగు టపా ఇక్కడ.

క్లుప్తంగా చెప్పాలంటే, నికేతా మెహ్‌తా తనకి పుట్టబోయే బిడ్డకి గుండె జబ్బు ఉండే ప్రమాదం ఉందనీ, పుట్టిన క్షణం మొదలుకుని జీవితాంతం పేస్‌మేకర్ వాడాల్సిన అవసరం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిసి తనకి అబార్షన్ కి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మన దేశపు చట్టాల ప్రకారం ఇరవై వారాలలోపే అబార్షన్ చేసుకోవాలట. కానీ ఈవిడకి ఇరవై నాలుగు వారాలకి ఈ విషయం తెలిసింది కనుక కోర్టుని చేరింది విషయం. హైకోర్టేమో ఆమె తరపు వాదన తోసిపుచ్చింది. ఈ అబార్షన్ చట్టసమ్మతం కాదు అని తేల్చింది.

ఈ కేసు ఫలితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి. ఓ పక్క ఆ పుట్టబోయే బిడ్డ కి జీవితాంతం బాధలు పడే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ కి, అదీ తల్లిదండ్రులు కోరుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని. అబార్షన్ నేరమా? ఘోరమా? తప్పా? ఒప్పా? అన్న మీమాంస కాదు ఈ టపా. ఈ కేసు విషయం లో ఏది న్యాయం అన్న చర్చ కోసం. మామూలుగా అబార్షన్ నేరం అనుకున్నాకూడా, ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేరం చేస్తే ఓ జీవితాన్ని జీవితాంతం చస్తూ జీవించే యాతన నుండి తప్పించవచ్చు కదా? ఈ కేసులో ఒక వాదన ఏమి రావొచ్చు అంటే – “ఒకవేళ ఇవేమీ లేకుండా బిడ్డ మామూలుగానే పుడితే…అప్పుడీ అబార్షన్ ఆ బిడ్డని చంపేసినట్లే కదా?” అని. కానీ, అది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, శిశువు గుండెజబ్బుతో పుట్టే అవకాశం ఉన్నప్పుడు – ఆ లాజిక్ పని చేస్తుందా? జబ్బుతో పుట్టిన బిడ్డ తో తల్లిదండ్రుల జీవితం, పుట్టిన శిశువు జీవితం, వీళ్ళలో జరిగే మానసిక సంఘర్షణా – ఇవన్నీ ఆలోచిస్తే మరి?

తొమ్మిదేళ్ళ వయసు నుండి పేస్‌మేకర్ వాడుతున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ మనిషి కథనం ప్రకారం జీవితాంతం దానిపై ఆధారపడి బ్రతకాల్సిన మనుషులు కూడా మామూలు జీవితం గడపొచ్చట.ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ట్రీట్ చేయొచ్చని అతను అన్నాడు. ఈ విషయం బానే ఉంది వినడానికి. అయితే, తెలిసి తెలిసీ…. అన్న భావన ఆ తల్లిదండ్రుల్లో రావడంలో నాకేమీ అసహజత్వం కనబడ్డం లేదు. పైగా, పేస్‌మేకర్ ట్రీట్‌మెంట్ ఖర్చుతో కూడుకున్నదట. జీవితాంతం ఆ ఖర్చు భరించే స్థోమత తల్లిదండ్రులకి ఉండాలి కదా.

“”But I will have to now stop working. We are not that rich to afford full-time nannies. Finances will certainly be one concern.”

-అన్న మాటల్ని బట్టి చూస్తే నికేతా దంపతుల అసహాయత అర్థమౌతోంది కదా. దానికి జవాబు గా బోలెడు సంస్థలు ముందుకొస్తున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తుంది జీవితాంతం – వంటి వాదనలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పుడిస్తున్న వాగ్దానాలే-వేటికీ గ్యారంటి లేదు అన్నది ఒక విషయమైతే, ఇలా ఎన్ని కేసులకని సాయం చేస్తారు? అన్నది మరో విషయం. ఈ కేసు తరువాత తమకి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కేసులు ఎక్కువైపోయాయంట కాబోయే తల్లిదండ్రుల్లో. ఈ విషయానికి సంబంధించి ఉపయోగపడే రకరకాల టెస్టుల గురించిన సమాచారం ఇక్కడ.

మన అబార్షన్ చట్టాల ప్రకారం 26 వారాల తర్వాత తల్లి కి ప్రమాదమైనప్పుడు అబార్షన్ చేసుకునే సౌలభ్యం ఉందట కానీ, బిడ్డ పరిస్థితి బాలేకపోతే కాదట. ఇది మరో వింత నాకు. ఏం? పుట్టాక ఆ బిడ్డ మాత్రం మనిషి కాదా? అలా అబార్షన్ ఆపాక పుట్టిన శిశువు ఏదో కారణానికి మరణిస్తే మాత్రం ఆ తల్లికి క్షోభ కలగదా?

పుట్టబోయే బిడ్డ పుట్టాలా వద్దా అన్న విషయం లో తల్లి అభిప్రాయానికి విలువ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? వంటివి మరిన్ని ప్రశ్నలు. అసలు బాధ్యత గల ఏ తల్లీ కారణం లేకుండా తనకి పుట్టబోయే బిడ్డను చంపాలనుకోదు అన్నది మరొక పాయింటు.  అబార్షన్ గురించి తల్లికి కొంత స్వేఛ్ఛ ఉండాలని నా అభిప్రాయం. పెంచడానికో, పుట్టించడానికో తల్లికి ఒకవేళ వ్యతిరేకత ఉంటే, ఆమెని ఆమె తాలూకా మనుషులు ఒప్పించలేకపోతే…బలవంతంగా కోర్టు బిడ్డని పుట్టనిచ్చాక ఆ బిడ్డ పరిస్థితి సాఫీగా ఉండాలనేముంది? నికేతా కేసు గురించి కాదు ఇది అంటున్నది. ఆ కేసులో కారణాలు వేరు. ఆ కేసులో నేనైతే నికేతాకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది more general context.

“”But what is disappointing is that we have been proved to be fools. We are educated fools. People in remote areas go to quacks for an abortion. The lesson here being sent out is: don’t follow the law. We are being punished for being law-abiding citizens.” -అన్న మాటల్లో అర్థమౌతున్నాయి నికేతా మెహ్‌తా ఈ కేసు విషయం లో అనుభవించిన క్షోభా, ఫలితం ఆమెలో కలిగించిన అసంతృప్తీ. “We have initiated awareness about the abortion law and that it needs to change with time and changing societal standards and medical advances,’’  – అన్నప్పుడు కాస్త ఆశాభావం కూడా కనిపించింది. (మూలం)

Published in:  on August 8, 2008 at 9:23 am Comments (2)

సందీప్ పాండే గురించి

సందీప్ పాండే ఎవరు? అన్న ప్రశ్న నుండి మొదలుపెడితే, ఆయన Asha Foundation వ్యవస్థాపకుల్లో ఒకరు. 2002లో రామన్ మెగసేసే అవార్డు గ్రహీత. భారద్దేశానికి చెందిన వారిలో అందరికంటే చిన్న వయసులో ఈ అవార్డు పొందిన వ్యక్తి. Active social activist. ఆయన కార్యరంగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత విషయాలకొస్తే, UC-Berkeley లో Mechanical Engineering లో PhD చేసారు. తరువాత రెండేళ్ళు IIT-Kanpur లో పని చేసి, 1993 లో పూర్తి స్థాయి సమాజ సేవకుడిగా మారిపోయారు.

నిన్న రాత్రి IIIT లో ఆయన ప్రసంగం ఉండింది. మాకొచ్చిన మెయిల్ సారాంశం ఇదీ:

Dr Sandeep Pandey will talk about his experiences as a social
activist in the rural areas of Uttar pradesh. He will touch upon
the themes of Right to Information, Right to Food, Right to Work,
Right to Education, Harmony in community, Nuclear disarmamemt,
Peace and Anti-Globalisation.

ఆయన గురించి చెప్పడానికి చాలానే ఉంది నిజానికి. అంతా ఈ చిన్న టపాలో కూర్చాలనుకోవడం మరీ అతి చేయడమే. అందుకని, నేను చెప్పదలుచుకున్నవి మాత్రం చెబుతాను. :) ఇంతకీ, కాలేజీ లో ప్రసంగం లో RTI అని మొదలైనా కూడా, అణు ఒప్పందం, SEZs, Social inequality, poverty వంటి విషయాలు మొదలుకుని Globalisation, Over-population దాకా ఎన్నో విషయాల మీద సాగింది. విన్నవారి ప్రశ్నలని బట్టి ప్రసంగం రూటు మారుతూ వచ్చింది. వింటున్నంత సేపూ నన్ను ఆకట్టుకున్నది ఆయన లో ఉన్న simplicity. చెప్పదలుచుకున్నది స్పష్టంగా, సూటిగా చెప్పడం, చెప్పిన దానిపై ఎక్కడా నమ్మకం సడలకపోవడం. ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చాయని కాదు. కొన్ని చోట్ల మరీ idealist లాగా అనిపించాడు. కొన్ని చోట్ల పూర్తి ఆధునికతకి వ్యతిరేకిలా అనిపించాడు. అయినప్పటికీ కూడా, సామాజిక విషయాలపై ఓ సమాజ సేవకుడి మాటలు, అదీ ఈ స్థాయి వ్యక్తి మాటలు లైవ్ వినడం నాకు ఇదే మొదటి సారి. తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉండింది. అణుఒప్పందం గురించి ఇప్పటిదాకా చదవని point of view ని ఆయన Buddha weeps in Jadugoda అన్న కథలో చెప్పారు. ప్రస్తుత అణుఒప్పందం పై ఈ కోణంలో ఇప్పటిదాకా పేపర్లలో అయితే చదవలేదు నేను. వేరే context లో ఈ విషయాల గురించి చదివినా కూడా. పాండే గారి వివరణలు ఈ విషయంలో వారి పరిశోధనని గురించి చెప్పాయి. RTI ఎలా మొదలైంది అన్న కథ కూడా నచ్చింది నాకు.

పొద్దున్న ఆయనదే ఒక వీడియో చూసాను. ఇది ఒక అరగంట సాగే ఆయన ఇంటర్వ్యూ. వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు. ఇక్కడ కూడా నాకు నచ్చింది ఇదే. ఆయన లో ఉన్న స్పష్టత, simplicity. చెప్పిన విషయాలన్నీ మనం ఒప్పుకుంటామా లేదా అన్నది వేరే విషయం. ఒక మనిషికి తాను చేస్తున్న పని సరైనదని పూర్తి నమ్మకముంటే, అది ఎలా ఉంటుందో పాండే మాటల్లో తెలుస్తోంది నాకు :) ఒక విధంగా నిన్నటి ప్రసంగం నాకు నిరాశే కలిగించి ఉండాలి. కానీ, Sandeep Pandey – the man గురించి కాస్త ఎక్కువ తెలుసుకునే అవకాశం కల్పించింది కనుక, క్షమించేస్తున్నా ;)

Published in:  on August 5, 2008 at 10:45 am Comments (1)

Rosy గారితో కాసేపు

నాకూ, ప్రశాంతికి మధ్య జరిగిన ఓ ఆన్లైన్ సంభాషణ లో రోసీ గారి గురించి తెలిసింది. చందానగర్ లో ఒక స్లం ఏరియా లో ఓ స్కూలు పెట్టి (ఫుల్ టైం స్కూల్) నడుపుతున్నారు అని. నాకు కాలేజీ నుండి దగ్గరే కదా, అని ఆవిడ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి ఈరోజు కలిసాను. కలిసి వచ్చాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. ఆవిడ ప్రచారం ఇష్టం లేదన్నది కానీ, నా ఉద్దేశ్యం లో మంచి పని చేసేవాళ్ళ గురించి ఇతరులకి చెప్పడం లో తప్పు లేదు. పైపెచ్చు, స్పూర్తి కూడా కలిగిస్తారు వాళ్ళు.

ఇంతకీ, నేను చందానగర్ స్టేషన్ దగ్గర కలుస్తా అని చెప్పాను. దానికి వచ్చే దారిలోనే అర్థమైంది అక్కడి మనుష్యుల living standards. స్టేషన్ దగ్గర పాపిరెడ్డి కాలనీ అని ఉంది. అక్కడ కాస్త నయం… పక్కా ఇళ్ళూ అవీ కనిపించాయి. ఇంతకీ ఆమెని కలిసాను. తర్వాత, వాళ్ళ స్కూలుకి తీసుకెళ్ళారు. ఆ కాలనీ లోనే కాస్త ముందుకెళితే, SVN school అని కనిపించింది. శారదా విద్యా నికేతన్ అట పూర్తి పేరు. స్కూల్లో నలభై మంది పిల్లలు. అందరూ ఇదివరలో కాగితాలేరడమో, అడుక్కోవడమో చేసిన పిల్లలే. ఒకరిద్దరి నుండి వారి కథలు కూడా విన్నాను. ఈ స్కూల్లో ఓ మానసిక వికలాంగుడైన అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మొదట స్కూల్లో చేరక ముందు ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు? అన్నది రోజీ గారు చెబుతూ ఉంటే ఆశ్చర్యమేసింది.

ఇది కాక ఓ అనాథ శరణాలయం కూడా నడుపుతున్నారు ఈమె. దానికి నేను వెళ్ళలేదు..కనుక దాని వివరాలు పెద్దగా తెలీవు.

ఇది మా  ఆషాకిరణ్ మాదిరి కాదు. ఫుల్-టైం బడి. కనుక, పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టవచ్చు. ప్రస్తుతమున్నది అద్దె భవనం. త్వరలో సొంత భవనం కట్టుకోగలం అన్నది ఆమె ఆశ. ఇంతకీ, వింత ఏమిటీ అంటే, అక్కడ చెప్పుకోదగ్గ ఫండింగ్ అంటూ రెగులర్ గా ఏదీ లేదు. ఆమె, కుటుంబ సభ్యులే దీనికి మహారాజ పోషకులు. అంటే, వాళ్ళేదో మహా వీర ధనవంతులని కాదు. వాళ్ళకి ఉన్న దానిలోనే ఇదంతా చేస్తున్నారు. ఇటీవలే applabs వాళ్ళు వచ్చి నోట్ బుక్స్ అవీ ఇచ్చారట స్కూలుకి. ఆవిడ ద్వారా ఆ కాలనీ వాసుల జీవితాలూ…వారి కష్ట నష్టాల్లోకి తొంగిచూడగలిగాను. నాకు బయటి ప్రపంచం తో అందునా, ఆ తరహా ప్రపంచం తో సంబంధాలు తక్కువే. కనుక, నాకు వాళ్ళ గురించి చెప్పడం ద్వారా సమాజం లో నేనూ ఉన్నా కనుక సమాజానికి నేనూ ఏదో చేయాలి అని మళ్ళీ గుర్తు చేసిన రోజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోను?

ఇది ఇంట్రో టపా. మరో కొద్ది రోజుల్లో మరో టపా వివరంగా రాస్తాను ఈ ట్రిప్ గురించి.

Published in:  on March 20, 2008 at 11:16 am Comments (6)

Motivation for the day :)

ఏదో ఓ చిన్న మంచి పని(అదే…మనం మంచి అనుకున్నది..) చేస్తాము. అది ఎవరికో ఎక్కడో ఓ చోట మేలు కలిగిస్తుంది. మనం ఆనందిస్తాం. వాళ్ళూ ఆనందిస్తారు. అది ఈ వ్యవహారాన్ని చూసే ఒక కోణం.
మరో కోణం, కాస్త సినికల్ కోణం – “నువ్వొక్కదానివి ఏదో చిన్న పనిచేస్తే? ఏమౌతుంది? ఏమన్నా తేడా ఉంటుందా వాళ్ళ జీవితాల్లో?”.
ఇంకో కోణం – “ఇలా చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఏదో చేయాలి…. అది నిజమైన పెద్ద మార్పు తీసుకురావాలి.” (దీన్నే enterpreneurship కోణం అంటాను నేను.)
ఇక, రెండో కోణం ని చూస్తే, ప్రతి ఒక్కరూ అంత నిరాశగా ఉండరు. మూడో కోణం చూస్తే, ప్రతి ఒక్కరూ అంత పనిమంతులై కూడా ఉండరు. ఎవరికి చేతనైన విధంగా వారు చేద్దామని అనుకుంటారు. (అసలు నాకెందుకు? నేను బాగున్నా కదా! అనేసుకుంటే అసలీ టపా మీక్కాదు…:) సమస్యే లేదు అలా అనుకుంటే మీకు…)
మొదటి రకం వాళ్ళని ప్రోత్సహిస్తే మూడోరకం లోకి మారినా మారొచ్చు. చెప్పలేం. అసలీ సుత్తంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇందాకే ఓ కొటేషన్ చదివాను…చదివాక… కొండంత ఉత్సాహం వచ్చింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..సినిక్స్ వ్యాఖ్యలు విని – “ఔను.. ఇప్పుడు నేనేదో ఓ చిన్న పని చేస్తే మాత్రం తేడా ఏముంటుంది ఈ ప్రపంచానికి?” అని. ఈ కొటేషన్ నాకు జవాబిచ్చింది.


Act as if what you do makes a difference. It does.  -William James,psychologist (1842-1910)

Published in:  on March 18, 2008 at 6:56 am Comments (3)

రెండో భార్య కి ఆస్తిహక్కు గురించిన వార్త

   ఈరోజు హిందూ పత్రిక లో రెండో భార్య కి భర్త ఆస్తి మీద హక్కు ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కనిపించింది. అది చదివాక కలిగిన ఆలోచనలే ఇప్పుడీ టపా రూపం లో బయటపెడుతున్నా :) అసలు టపా ఇక్కడ చదవొచ్చు.

ఇంతకీ సారాంశం ఏమిటీ అంటే – ఆస్తిపై రెండో భార్య అయిన వ్యక్తికి ఎటువంటి హక్కూ ఉండదనీ, కానీ, ఆమె సంతానానికి మాత్రం కలుగుతుంది అని. మళ్ళీ అలా అని రెండో పెళ్ళి చెల్లుతుంది అని కాదు.

” Children born of second marriage are entitled to a share in the property of their father though the second marriage itself is void, the Supreme Court has held.”

పిల్లలు లీగలంట…. పిల్లల తల్లి మాత్రం లీగల్ కాదంట. అంటే… ఆ తల్లి పరంగా చూస్తే ఆమె దిక్కులేనిదే…ఒక వేళ పిల్లలు వదిలేస్తే. పైగా ఆ వార్త తాలూకా కేసు ప్రకారం మొదటి భార్య తానే భర్త కి దూరంగా వెళ్ళిపోయింది. తరువాతే భర్త రెండో పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు అతను చనిపోగానే మొదటి భార్య కూడా ఆస్తి కోసం వస్తే ఇన్నేళ్ళూ కలిసి జీవించిన రెండో భార్యకి ఆస్తిహక్కు లేదంట… ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన మొదటి భార్య కి మాత్రం ఉందట! అంటే… రెండో భార్య కి ఆస్తి హక్కు కల్పించడం  అన్నది ఈ కేసు ఒక్కదాన్ని చూసి నిర్ణయించే విషయం కాకపోయినా కూడా, ఈ తరహా ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నది నాకు తోస్తుంది. అయినా, పిల్లలకి హక్కున్నప్పుడు వాళ్ళ తల్లికి ఎందుకూడదు? అన్నది ఇక్కడ ప్రశ్న.  ఇంకో ప్రశ్న ఏమిటి అంటే… మొదటి భార్య ఈ కేసులోలా తానుగా బయటకు వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తి హక్కు వస్తుందా? రెండో భార్య కి మాత్రం ఎందుకు రాదు? అన్నది.

నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆ తీర్పు గురించి చదివాక. సుప్రీం కోర్టు అంతటి ధర్మాసనం అలా ఎలా తీర్పిచ్చింది? , అందులోనూ ఈ కేసు విషయంలో అని.  భర్తే మొదటి భార్య ని వదిలేసి రెండో మనిషి ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు రెండో భార్య లీగల్ కాదు అనడం ఒక వాదన (అదన్నా కూడా మళ్ళీ పిల్లలకిచ్చి తల్లికివ్వకపోవడం అన్యాయమే అని తోస్తుంది.) మరి ఈ పేపర్ వార్త ప్రకారం కనీసం అది కూడా కాదు కేసు.  ఏమిటో ఈ తీర్పులు! సరిగా రాసిన వ్యాసం ఇంకోటి కావాలేమో..సరైన ఐడియా రావడానికి. అయినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు నాకు నచ్చలేదు :(

Published in:  on January 28, 2008 at 8:05 pm Comments (5)

మా స్కూల్ లో ఓ చిచ్చర పిడుగు

ఈ చిచ్చర పిడుగు అన్న పదం ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు కానీ….. ఇక్కడ మొన్న సోమవారం నాడు వచ్చిన ఓ పిల్లని గురించి చెప్పడానికి ఇంతకంటే నాకు మంచి పదం కనబళ్ళేదు…

ఆ పిల్ల ఎల్కేజీ చదువుతోందట. వయసు ఏడేళ్ళట…ఏడేళ్ళకి ఎల్కేజీ ఏమిటి అనకండి…. అదంతే. పిల్ల బాగా తెలివితేటలు గలది…చురుగ్గా ఉంది. మూడు భాషల్లోనూ అక్షరాలు రాయడం వచ్చు. ఏడేళ్ళప్పటికి నాకైతే హిందీ రాదు మరి. మూడో తరగతి నుండి ఉండేది మాకు హిందీ…ఆ పిల్లకి అప్పుడే ఎలా వచ్చేసిందో ఏమో గానీ. ఎక్కాలొచ్చట…కొంతవరకూ. తెలుగైతే గుణింతాలు కూడా వచ్చు. ఏదడిగినా చురుగ్గా చేసేస్తోంది…వేగంగా కూడానూ. సరే, ఆ పిల్లని ఎంగేజ్ చేయాలని, మా స్కూల్ కి సంబంధించిన ఆషా మేడం కి తెలుగు అక్షరాలు నేర్పమని అన్నాం నేను, ఆషా గారూనూ. (ఆమె కి తెలుగు తెలియదు). ఆ పిల్లల సైకాలజీ ప్రకారం చూస్తే వాళ్ళు సిగ్గుపడి చెప్పననాలి. కానీ, ఈ పిల్ల దొరికిందే చాన్స్ అని చెప్తా అన్నది.

కాసేపు నేను వేరే పిల్లల గొడవ లో పడి వీళ్ళని చూడలేదు. తరువాత చూస్తే – “ఇది తప్పు రాసావు. ఇలా రాయకూడదు…ఇలా రాయాలి…” అనుకుంటూ ఏదేదో చెబుతూ ఉంది ఈ పిల్ల ఆషా గారికి :) ) నిజం చెప్పొద్దూ…భలే నవ్వు వచ్చింది. పైగా, ఆవిడ అక్షరాలు రాస్తే, కరెక్షన్ కూడానూ! ఓ పక్క నవ్వొస్తోంది.. ఓ పక్క ఆ పిల్లని చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది. ఆ స్కూలుకొచ్చిన పిల్లల్లో నేను – కాస్త చురుగ్గా, ఆత్మవిశ్వాసం తో నిండి ఉండి, మరీ అల్లరిగా కాక బుద్ధిగా ఉండే పిల్లల్ని ఇద్దరినే చూసాను. ఒకరు మీనా, ఇది వరలో రెండు మూడు సార్లు ఈ బ్లాగులోనే రాసాను తన గురించి. రెండో పిల్ల ఈ అమ్మాయి శిరీష. అందులో మీనా అందరికంటే పెద్ద పిల్ల, ఈమె దాదాపు అందరికంటే చిన్న పిల్లానూ.

ఏమైనా కూడా ఈ పిల్ల ఇలాగే ఉంటే మంచి స్థానానికి వస్తుంది జీవితం లో అని అనిపిస్తోంది.

Published in:  on September 26, 2007 at 1:27 pm Comments (4)